చర్చకు కేంద్రం ఎందుకు భయపడుతోంది

చర్చకు కేంద్రం ఎందుకు భయపడుతోంది

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు తదితర అంశాలపై చర్చించకుండా కేంద్రం ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలను రాజ్యసభ నుంచి 10రోజుల పాటు సస్పెండ్ చేయడం సిగ్గు చేటని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చర్చకు ఎందుకు భయపడుతోంది. ప్రతిపక్షాల గొంతు ఎందుకు నొక్కుతోందని ప్రశ్నించారు. 

కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో మంగళవారం విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల నుంచి 23 మంది విపక్ష ఎంపీలపై వేటు వేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని లోక్ సభ నుంచి నలుగురు, రాజ్యసభ నుంచి 19 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. వారిలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలైన బడుగుల లింగయ్య యాదవ్, రవిచంద్ర వద్దిరాజు, దామోదర్​రావు ఉన్నారు. సస్పెన్షన్ ను నిరసిస్తూ ఎంపీలు ఇవాళ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టనున్నారు.