- అసెంబ్లీ లాబీల్లో బీజేఎల్పీ నేతలతో కేటీఆర్ సరదా సంభాషణ
- బీజేఎల్పీలోకి వెళ్లిన రాజాసింగ్ను బయటకు రావాలన్న కేటీఆర్
- మీరే లోపలికి రావాలంటూ కేటీఆర్నూ ఆహ్వానించిన పాయల్ శంకర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోమవారం గవర్నర్ స్పీచ్ అయిపోగానే ఎవరి పార్టీల వాళ్లు.. వాళ్ల ఎల్పీల్లోకి వెళ్లారు. ఇదే క్రమంలో బీజేపీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ బీజేఎల్పీలోకి వెళ్లారు. అదే సమయంలో బీజేఎల్పీ ఆఫీసుకు పక్కనే ఉండే బీఆర్ఎస్ఎల్పీ నుంచి కేటీఆర్ బయటకు వస్తూ.. ఆయన లోపలకు వెళ్తుండడాన్ని గమనించారు. వెంటనే సస్పెండ్ అయిన వ్యక్తి బీజేఎల్పీలోకి ఎలా వెళ్తారు? బయటకు రావాలంటూ రాజాసింగ్తో సరదాగా వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్.. కేటీఆర్ను బీజేఎల్పీలోకి రావాలంటూ ఆహ్వానించారు.
దానికి స్పందించిన కేటీఆర్.. ‘నేను లోపలికి వస్తే మీడియాలో లేనిపోని వార్తలు వస్తయ్’ అంటూ కామెంట్ చేశారు. దీంతో రెండు పార్టీల సభ్యులు నవ్వులు చిందించారు. ఆ తర్వాత కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. మంత్రులు, పీసీసీ చీఫ్ను అసెంబ్లీ లాబీల్లో కలిశారు. తన వివాహ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కు రావాలంటూ వారిని ఆహ్వానించారు. అయితే, ఈ సందర్భంగా మీడియా.. కాంగ్రెస్లోకి వెళ్తున్నారా? అని ప్రశ్నించగా మునిగిపోయే పడవలో ఎవరైనా చేరుతారా? అంటూ కామెంట్ చేశారు.
గ్రౌండ్లో ఎవరు బలంగా ఉన్నారో అందరికీ తెలుసన్నారు. మరోవైపు అసెంబ్లీ లోపల కూడా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పక్షంవైపు కూర్చున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. వారిని బీఆర్ఎస్ సభ్యుల దగ్గర కూర్చోవాలన్నారు. కాలె యాదయ్య దగ్గరకు వెళ్లి.. బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని సూచించారు. అయితే, ఆయన మాత్రం తాను కాంగ్రెస్ వైపే కూర్చుంటానని చెప్పడం గమనార్హం.
