కాళేశ్వరం ఇక పనికిరాదు... ఇంతవరకు ఒక్క చుక్క కూడా ఎత్తిపోసింది లేదు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

కాళేశ్వరం ఇక పనికిరాదు... ఇంతవరకు ఒక్క చుక్క కూడా ఎత్తిపోసింది లేదు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
  • నీళ్లన్నీ ఎల్లంపల్లి నుంచి వచ్చినవే
  • గతంలో మెదడంతా కరిగించి డిజైన్​ చేశానన్న కేసీఆర్​.. ఇప్పుడు మాట మార్చారు

హనుమకొండ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని, దానిని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్  చేశారు. ఇంత వరకు కాళేశ్వరం నుంచి చుక్క నీటిని ఎత్తిపోయలేదని, ఇప్పుడు వచ్చే నీళ్లన్నీ ఎల్లంపల్లి నుంచి వస్తున్నవేనన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్​లో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర పర్మిషన్  ఇవ్వలేదని కాళేశ్వరం కట్టామని హరీశ్ రావు చెబుతున్నాడని, పర్మిషన్  ఇవ్వకపోతే జనాలను ముంచే ప్రాజెక్టు కడతారా? అని ప్రశ్నించారు. 

మెదడంతా కరిగించి కాళేశ్వరం డిజైన్  తానే చేశానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడేమో ఎగ్జిక్యూట్  చేసిన అధికారులదే బాధ్యత అని చేతులెత్తేస్తున్నారని, ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? అని  ప్రశ్నించారు.  కేసీఆర్​ అంటే కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే కేసీఆర్​ అని చెప్పుకున్న వాళ్లంతా ఇప్పుడు నోళ్లు మూసుకున్నారన్నారు. కాళేశ్వరం కమిషన్  విచారణకు వందలాది కార్లు, హంగూ ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఇది సహించరాని నేరమన్నారు. డబ్బులన్నీ దాని మీదనే పెట్టి, మిగతా ఏ ప్రాజెక్టునూ పట్టించుకోలేదని మండిపడ్డారు. కాళేశ్వరం కరెంట్ ఖర్చులే రూ.12 వేల కోట్ల నుంచి 13 వేల కోట్ల వరకు ఉంటున్నాయని, జనాల సొమ్మును ఇకపై కాళేశ్వరంపై ఖర్చు చేయవద్దన్నారు. ఎల్లంపల్లి నుంచి వస్తున్న నీళ్లతోనే పంటలు పండుతున్నాయని, అందుకే పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్  చేశారు. 

ఎర్రజెండా లేకుండా చేయాలనేదే కేంద్రం లక్ష్యం..

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్​ పేరుతో మానవ హననం చేస్తోందని, ఇది రాక్షస పాలనకు సంకేతమని కూనంనేని పేర్కొన్నారు. మార్చి వరకల్లా మావోయిస్టులను లేకుండా చేస్తామని స్వయంగా కేంద్ర మంత్రే చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ప్రశ్నించే వాళ్లన్నా, ఎర్రజెండా అన్నా భయమని, అందుకే ఎర్రజెండా లేకుండా చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్  నాలుగో స్థానంలో ఉందంటూ మోదీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.