- యూనియన్లకు కార్మిక శాఖ నోటీసులు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ యూనియన్లతో రాజీ చర్చలు జరుగుతున్నాయని, ఆ టైంలోనే సమ్మెకు వెళ్లడం చట్ట విరుద్ధమని కార్మిక శాఖ ప్రకటించింది. ఐదో తేదీ నుంచి సమ్మె చేస్తున్నామని జేఏసీలు ప్రకటించిన నేపథ్యంలో, ఆర్టీసీ యూనియన్లకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ గంగాధర్ మంగళవారం నోటీసులు పంపించారు. పరిశ్రమల వివాద చట్టం సెక్షన్ 22(1)(డీ) ప్రకారం రాజీ చర్చలు ముగిసిన వారం రోజులకు గానీ సమ్మె తేదీని ప్రకటించొద్దని అందులో పేర్కొన్నారు. చర్చలు పెండింగ్లో ఉండగానే సమ్మె తేదీలు ప్రకటించారని తెలిపారు. ఆర్టీసీలో సమ్మె నిషేధం అమలవుతోందన్నారు. మొదట సెప్టెంబర్ 23న మీటింగ్ ఉంటుందని ప్రకటించినా, అది రద్దు అయింది. దీంతో ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు రాజీ ఒప్పందం ఉంటుందని కార్మిక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.