పోలీసులు న్యాయం చేయలేదని కూలి ఆత్మహత్య

పోలీసులు న్యాయం చేయలేదని కూలి ఆత్మహత్య

వికారాబాద్:  పోగొట్టు కున్న చిట్టీడబ్బులు ఇప్పించాలని పోలీసులను కోరినా,న్యాయం జరగలేదనే మనస్తాపంతో ఓ అడ్డాకూలీ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ధారూరు మండలం రాస్నంకు చెందిన కావలిరాములు, అతని భార్య బాలమణి, పిల్లలు శృతి,తరుణ్ లతో కలసి కొన్నా ళ్లుగా వికారాబాద్‍ రామయ్యగూడలో ఉంటున్నారు. రాములు అడ్డా కూలీ. సంపాదిస్తున్న మొత్తంలో కొంత రామయ్యగూడ కాలనీలోని ఓ వ్యక్తి వద్ద లక్ష రూపాయల చిట్టివేసున్నాడు. వచ్చిన చిట్టీ డబ్బులను నెలరోజులక్రితం తీసుకున్నాడు. ఆ నగదును జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే తోటికూలీ, పూడూరు మండలం గొంగుపల్లికి చెందిన కృష్ణతో కలిసి రాములు మందు తాగారు. ఆ తర్వాత రోజు రాములు తన జేబులో డబ్బులుచూసుకోగా కనిపించలేదు. కృష్ణనే దొంగిలించి ఉంటాడని భావించి వికారాబాద్‍ పోలీస్టేషన్ లోఫిర్యాదు చేశాడు. పోలీసులు కృష్ణను పిలిపించి విచారించగా తాను తీసుకోలేదని వివరించాడు.

కూడబెట్టిన సొమ్ము పోవడం, పోలీసులు న్యాయంచేయడం లేదనే మనస్తాపంతో ఈనెల 24వ తేదీన వికారాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది గమనించిన పోలీసులు రాములును చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రంలోని మిషన్‍ ఆసుపత్రికి తరలించారు. అనంతరం రాములు భార్యకు సమచారం ఇచ్చారు. చికిత్స పొందుతూ రాములు గురువారం చనిపోయాడు. అనంతరం మృతదేహాన్ని రాస్నంకు తరలించి పోలీసులు అంత్యక్రియలు జరిపించారు. తన భర్త మృతికికారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుని భార్య డీఎస్పీని కోరింది. అంత్యక్రియలు పూర్తయ్యాక తమ కార్యాలయానికి రండి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాలమణి,పిల్లలతో కలసి శుక్రవారం డీఎస్పీని కలిశారు.న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.