- షాపులు తెరిచినా రాని గిరాకీ.. పడిపోయిన వ్యాపారం
- తెరవకున్నా రెంట్ చెల్లించాలని ఓనర్ల ఒత్తిడి
- కరెంట్ బిల్లులు, జీతాలూ చెల్లించలేని పరిస్థితి
- హైదరాబాద్లో 20 శాతం షాపుల మూత
- బట్టలు, ఎలక్ట్రానిక్స్ షాపులు, హాస్టళ్లు, హోటళ్లు, జిమ్స్పై ఎక్కువ ఎఫెక్ట్
హైదరాబాద్, వెలుగు: వ్యాపారులను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. లాక్డౌన్ పోయి అంతా అన్లాక్ అవుతున్నా గిరాకీల్లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రజలూ కరోనా భయంతో రోజూ అవసరమయ్యే సరుకులు తప్ప వేరే వాటి జోలికి పోకపోతుండడంతో బిజినెస్లు డల్ అయిపోయాయి. దీంతో ఉన్న షాపులకు కిరాయిలు కట్టలేక.. కరెంట్ బిల్లులు చెల్లించలేక.. దాంట్లో పనిచేసేవాళ్లకు జీతాలివ్వలేక సతమతమవుతున్నారు. హాస్టళ్లు, బట్టలు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, జిమ్స్, కోచింగ్ సెంటర్ల బిజినెస్ చాలా వరకు పడిపోయింది. ఒక్క హోటళ్లలోనే టేక్అవే నడుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో వ్యాపారుల్లోనూ భయం నెలకొంది. దీంతో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని కొన్ని సిటీల్లో కొందరు వ్యాపారులు సొంతంగా లాక్డౌన్ పెట్టేసుకున్నారు. షాపులు తెరిచినా గిరాకీ అంతంతే ఉండడం, మెయింటెనెన్స్ ఖర్చులూ రాకపోవడంతో షాపులు తీసేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదు. ఇప్పటికే హైదరాబాద్లో 20 శాతం షాపులు మూతపడినట్టు అంచనా. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో చాలా వరకు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. లాక్డౌన్కు ముందు రోజూ రూ.5 వేల నుంచి రూ.-10 వేల వ్యాపారం జరిగేదని, ఇప్పుడు కరోనా భయంతో కస్టమర్లు రాక గిరాకీ రూ.వెయ్యి కూడా దాటడం లేదని ఎల్బీనగర్కు చెందిన దినేశ్ అనే ఓ బట్టల వ్యాపారి వాపోయారు. నెలనెలా రూ.10 వేలు కిరాయి కట్టలేక ఇద్దరు సేల్స్బాయ్స్ను తీసేశాని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 30 వేల బట్టల దుకాణాలున్నాయి. కస్టమర్లు రాక కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఆషాఢం ఆఫర్స్లో భారీ డిస్కౌంట్ పెట్టినా బిజినెస్ జరగట్లేదు. పెండ్లిండ్ల సీజన్లో రూ.5 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల బిజినెస్ నడిచేదని, ఇప్పుడు రాష్ట్రం మొత్తంగా రూ.500 కోట్ల బిజినెస్ కూడా జరగలేదని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. లాక్డౌన్ టైంలో షాపులు తీయక బట్టలను ఎలుకలు కొరికేశాయడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.
హాస్టళ్లకు అద్దె కష్టాలు
హైదరాబాద్తోపాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో స్టూడెంట్లు, ఉద్యోగులపై ఆధారపడి చాలా మంది ప్రైవేట్ హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే సుమారు 10 వేలకుపైగా హాస్టళ్లు ఉంటాయని అంచనా. లాక్డౌన్తో అవన్నీ మూత పడిపోయాయి. మార్చి నుంచి ప్రారంభం కావాల్సిన సివిల్స్ కోచింగ్ బ్యాచ్లకు స్టడీ రూమ్లు, హాస్టళ్ల కోసం గాంధీ నగర్లోని 50 మంది బిల్డింగ్ ఓనర్లకు రూ.లక్ష చొప్పున రూ.50 లక్షల వరకు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు కొందరు. కానీ, లాక్డౌన్తో అవేవీ తెరుచుకోక డబ్బు నష్టపోయినట్టు చిత్తూరుకు చెందిన సంజీవరెడ్డి అన్నారు. ఎవరూ లేకున్నా నిర్వాహకులకు మాత్రం కిరాయి బాధ తప్పట్లేదు. ఒక్కో హాస్టల్కు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు కిరాయిలే చెల్లించాల్సి ఉంటుందని, మరో 2, 3 నెలలు ఇలాంటి పరిస్థితులే ఉంటే బెడ్లు, వంట సామాన్లతో సహా పూర్తిగా అమ్మేసుకుని వెళ్లాల్సి వస్తుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లదీ అదే పరిస్థితి. గతంలో రోజూ రూ. 10 వేల బిజినెస్ నడిచే హోటళ్లలో ఇప్పుడు రూ. వెయ్యి కూడా మించట్లేదని సికింద్రాబాద్ కు చెందిన ఓ హోటల్ ఓనర్ సత్యం చెప్పారు.
రూ.10 వేల కోట్ల నష్టం
ఒక్క హైదరాబాద్లోనే ట్రేడ్ లైసెన్స్ ఉన్న వ్యాపారులు సుమారు 2 లక్షల మంది దాకా ఉంటారు. అనధికారికంగా మరో లక్ష మంది వ్యాపారులు ఉంటారని అంచనా. కరోనా కాలంలో కిరాణా, నిత్యావసర సరుకుల వ్యాపారం తప్ప ఇతర వ్యాపారాలు నడిచింది అంతంతే. రాష్ట్రంలోని బట్టల షాపులు, ఎలక్ర్టానిక్స్, ఫర్నిచర్, హోటళ్లు, కర్రీ పాయింట్స్, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు. పెట్రోల్బంకులు, జిమ్స్, జ్యుయెల్లరీ ఇలా రకరకాల వ్యాపారాలు కలిపి రూ.10 వేల కోట్లకుపైగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
హోటల్ ఉందని చెప్పేందుకే తీస్తున్నం
లాక్డౌన్కు ముందు మా హోటల్ రోజుకు రూ.లక్షన్నరకుపైగా నడిచేది. ఇప్పుడు 20 నుంచి 30 శాతం ఆర్డర్స్ కూడా రావట్లేదు. స్టాఫ్కు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మొత్తం బంద్ పెట్టలేక.. మా హోటల్ ఉంది అని చెప్పేందుకే తెరిచి పెడుతున్నాం. ఓనర్స్ కిరాయి తగ్గించట్లేదు.
– మెహిదీ పటేల్,రెస్టారెంట్ మేనేజర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్
కిరాయి కోసం ఒత్తిడి
మార్చి 20 నుంచి జిమ్ బంద్ ఉన్నది. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రెంట్ పెండింగ్లో ఉంది. మా ఓనర్ కిరాయి కోసం ఒత్తిడి చేస్తున్నడు. మూడున్నర నెలల నుంచి బంద్ ఉందని, ప్రస్తుతం రెంట్ కట్టలేనని చెప్పినా వినిపించుకోట్లేదు. తనకూ పేమెంట్లు ఉంటయి కదా అంటున్నడు. గవర్నమెంట్ జిమ్లకు ఎప్పుడూ పర్మిషన్ ఇస్తదో తెలుస్తలేదు. ఐదు, పది వేలంటే రెంట్ కట్టొచ్చు. నెలకు రూ.55 వేలు కట్టాలంటేనే ఏం చేయాలో అర్థం కావట్లేదు.
– విష్ణుకుమార్, డేజ్ ఫిట్నెస్ జోన్, విద్యానగర్
కరోనాపై సర్కార్ కాడేత్తేసింది..
