
పారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ అంచానాలకు మించి రాణించాడు. సెమీ ఫైనల్ వరకు వచ్చి గోల్డ్ మెడల్ పై ఆశలు రేపినా డిఫెండింగ్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓడిపోయాడు. ఆదివారం జరిగిన సెమీస్లో లక్ష్య 20–22, 14–21తో రెండో ర్యాంకర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలవ్వడంతో గోల్డ్ మెడల్ ఆశలు పోయాయి.అయితే సోమవారం జరిగే కాంస్య పతక పోరులో ఏడో ర్యాంకర్, మలేసియాకు చెందిన లీ జి జియాతో తలపడనున్నాడు.
ఈ మ్యాచ్లో గెలిస్తే ఒలింపిక్ పతకం సాధించిన ఇండియా తొలి పురుష షట్లర్గా నిలుస్తాడు. కాంస్య పతక మ్యాచ్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ తన అత్యుత్తమ ప్రదర్శనను అందించగలనని విశ్వాసం వ్యక్తం చేశాడు. "కాంస్య పతక పోరుకు సిద్ధంగా ఉన్నాను. 100% దేశానికి మెడల్ అందించడానికి ప్రయత్నిస్తాను. ఈ మ్యాచ్ నుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. తర్వాత మ్యాచ్ లో చక్కని ప్రదర్శన చేస్తాను. అని విక్టర్ ఆక్సెల్సెన్తో సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత లక్ష్యసేన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ సోమవారం సాయంత్రం(ఆగస్ట్ 5) సాయంత్రం 6 గంటలకు Sports18 లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. JioCinema లోనూ ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. ఇప్పటికే బ్యాడ్మింటన్ సింగిల్స్ పివి సింధుతో పాటు డబుల్స్ జోడీలో భారత ఆటగాళ్లు అందరూ ఓడిపోయారు. దీంతో లక్ష్యసేన్ బ్యాడ్మింటన్లో భారత్కు ఏకైక పతక ఆశగా మిగిలిపోయాడు.