- కేంద్ర మంత్రి బండి సంజయ్
కోఠి, వెలుగు: రాష్ట్రంలో జరిగిన భూకుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజీ రాజకీయాలు చేస్తూ లోపాయికారీ ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా, ఆయన కుటుంబ సభ్యుల అరెస్టులో మాత్రం కాలయాపన చేస్తున్నారని.. దీని వెనుక సీఎం రేవంత్రెడ్డి ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.
డ్రగ్స్, ఈ-ఫార్ములా, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తు ఏమైందని నిలదీశారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సిట్ల పేరుతో నాన్చకుండా భూ అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కోఠిలోని వివేకవర్ధిని కాలేజీలో తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ చేపట్టిన 'సేవా సంకల్ప్ అభియాన్' రక్తదాన శిబిరంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ నిజాం రాజును పొగడడం సిగ్గుచేటన్నారు. నిజాం నిరంకుశ పాలనను, రజాకార్ల అణచివేతను ఎదిరించి పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలదని గుర్తుచేశారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ చొరవతోనే హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించిందని, రాజకీయ లబ్ధి కోసం నిజాంను నెత్తికెత్తుకోవడం సరికాదని హితవు పలికారు.
