నెట్వర్క్, వెలుగు: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయ్యాల్లో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రజాపాలన వేడుకల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం చెర నుంచి తెలంగాణ విముక్తి పొంది భారతదేశంలో విలీనమైందని గుర్తుచేశారు. అస్తిత్వ పోరాటానికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తుందని అన్నారు. కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
విమోచన పోరాట చరిత్రను ప్రజలకు తెలియజేయాలి
ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ హాకీ అకాడమీకి ఎంపికైన 15 మంది జిల్లా క్రీడాకారులకు హాకీ స్టిక్ లు, రూ.30 వేల నగదును అందజేసి అభినందించారు. వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల శంకర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ప్రజలకు విమోచన పోరాట చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు, పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. నిర్మల్కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిళ పాల్గొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో లెజిస్టేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అడిషనల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్పరేడ్గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్17న భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజును ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలితాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కలెక్టర్గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేశ్బి. గితే పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్చైర్పర్సన్ జిందం కళ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మహిళా కమిషన్ గౌరవ చైర్పర్సన్ నేరెళ్ల శారద పాల్గొని ప్రసంగించారు. కలెక్టర్ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేశ్చంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. చొప్పదండిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జాతీయ జెండాను ఎగురవేశారు. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి కార్మికక్షేత్రాలైన మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో సింగరేణి జీఎం ఆఫీసుల్లో ఏరియా జీఎంలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.
