బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: 40 మందికిపైగా ప్రయాణికులు

బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: 40 మందికిపైగా ప్రయాణికులు

కిన్నౌర్: కొండ అంచులపై ఉన్న జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక బస్సుతో పాటు మరికొన్ని వాహనాలపై ఉన్నట్టుండి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో బస్సుతో పాటు మిగతా వాహనాల్లోనూ జనాలు ఉన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 40 మందికి పైగా ఆ కొండ చరియల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌‌ జిల్లా చౌరా ప్రాంతంలో ఉన్న నేషనల్ హైవే 5పై బుధవారం ఉదయం 11.56 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కిన్నౌర్‌‌ నుంచి హరిద్వార్‌‌కు వెళ్తున్న హిమాచల్‌ ప్రదేశ్‌ ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో చిక్కుకుంది. ఆ సమయంలో బస్సులో నిండుగా జనాలు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. బస్సుతో పాటు కారు, ట్రక్కు కూడా కొండచరియల కింద చిక్కుకున్నాయని తెలిపారు. ఈ ఘటన గురించి తెలియగానే ఆర్మీ, ఐటీబీపీ బలగాలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్‌లను రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సిందిగా కోరామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్ చెప్పారు. ఆ తర్వాత వేగంగా పోలీసులతో పాటు రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొండ చరియల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆపరేషన్ షురూ చేశారు. ఇప్పటికే బస్సు డ్రైవర్‌‌ను కాపాడామని కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొద్ది రోజులుగా హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తరచూ కొండ చరియలు విరిగిపడుతున్నాయి.