
హైదరాబాద్, వెలుగు: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వేల కోట్ల రూపాయల ఎగవేతలకు పాల్పడుతున్నారని, బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలే అందుకు కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. ఎగవేతదారుల విషయంలో అధికారులు చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. దీంతో మధ్యతరగతి ప్రజలు రుణాలు తీసుకునేటప్పుడు చార్జీల భారాన్ని మోయాల్సి వస్తున్నదని చెప్పింది.
జరిమానాల పేరుతో బ్యాంకులు సామాన్యుడి జేబులు ఖాళీ చేస్తున్నాయని, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని అభిప్రాయపడింది. హైదరాబాద్, సనత్ నగర్ ఎస్బీఐ బ్రాంచిలో ముందస్తు రుణ చెల్లింపులకుగాను ఎలాంటి సమాచారం లేకుండా బ్యాంకు చార్జీలను కట్ చేయడాన్ని ఉత్తమ్ ధాతు అండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిని జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టిన సందర్భంగా పైవిధంగా చెప్పారు. ఆస్తులను హామీగా ఇచ్చి తీసుకున్న రుణాన్ని ముందుగా చెల్లించిన పాపానికి రూ.1.16 కోట్లను కంపెనీ ఖాతా నుంచి బ్యాంక్ మినహాయించుకుందని న్యాయవాది చెప్పారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు చర్య ఉందన్నారు. మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేలా బ్యాంకుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
దీనిపై హైకోర్టు, ఇచ్చిన రుణాలు వసూలు చేయలేకపోతున్న బ్యాంకులు ముందుగా రుణం చెల్లిస్తే మినహాయింపు చేయడం తగదని వ్యాఖ్యానించింది. విచారణను వాయిదా వేసింది.