అదృష్టం అంటే ఇదే.. తిరుపతి అలిపిరి దగ్గర చిరుత దాడి.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు..

అదృష్టం అంటే ఇదే.. తిరుపతి అలిపిరి దగ్గర చిరుత దాడి..  తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు..

తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం ( జులై 26 ) అలిపిరి ఎస్వీ జూ పార్క్ రోడ్డులో బైక్ పై వెళ్తున్నవారిపై దాడికి యత్నించింది చిరుత. చిరుతను ముందే గమనించిన ప్రయాణికులు దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అటుగా కారులో వెళ్తున్నవారు చిరుత సంచరిస్తున్న దృశ్యాలను వీడియో తీశారు. వీడియోలో పొదల చాటున పొంచి ఉన్న చిరుత బైక్ పై వెళ్తున్నవారిపై ఒక్కసారిగా దాడికి యత్నించింది.

అయితే.. బైక్ స్పీడ్ గా వెళ్తుండటం వల్ల పులి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు ప్రయాణికులు. ఈ క్రమంలో బైకును ఢీకొన్న పులికి స్వల్ప గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొనడంతో కిందపడిపోయింది పులి. కొద్దిసేపటికి తేరుకున్న పులి పొదల్లోకి వెళ్ళింది. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల కాలంలో తిరుమల పరిధిలో తరచూ చిరుత పులుల సంచారం పట్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.టీటీడీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు చిరుత పులులను బంధించి అటవీ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇటీవల చిరుత పులి దాడిలో పలువురు భక్తులు గాయపడ్డారు. గతంలో ఓ చిన్నారి చిరుత దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తిరుమల పరిధిలో చిరుత పులుల సంచారాన్ని కట్టడి చేయాలని కోరుతున్నారు భక్తులు