షాద్ నగర్, వెలుగు: చౌదర్ గూడా మండలంలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామ అటవీ ప్రాంతంలో అనుమానాస్పద రీతిలో చిరుత పులి మృతి చెందింది. శనివారం ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ఐదారురోజుల క్రితమే చిరుతపులి మృతి చెంది ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. చిరుతపులి మృతికి కారణాలను అన్వేషిస్తున్నారు. పెద్ద ఎల్కిచర్ల అడవి సుమారు 654 ఎకరాల్లో విస్తరించి ఉంది.
ఈ అడవిలో కొంత కాలంగా క్రూర మృగాలు తిరుగుతున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. చిరుత మరణించిన విషయాన్ని గమనించిన గొర్ల కాపరులు గ్రామంలోని వారికి ఈ విషయాన్ని తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుతపులికి పోస్ట్ మార్టం నిర్వహించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అనంతరం అడవిలోనే చిరుతపులి మృతదేహాన్ని ఫారెస్ట్ అధికారులు ఖననం చేశారు.