
శనివారం సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు జరగనున్న వర్చువల్ ర్యాలీని తెలంగాణలోని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ జన్ సంవద్ ర్యాలీ పేరిట నిర్వహించే కార్యక్రమాన్ని ఆన్లైన్ వేదికల ద్వారా వీక్షించాలని సూచించారు. బీజేపీ తెలంగాణ సామాజిక మాధ్యమాలు (ఫేస్బుక్, యూట్యూబ్ వేదికల) ద్వారా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అందించే సందేశం వినాలన్నారు. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. ఆన్లైన్ ద్వారా భావాల్ని పంచుకోవాల్సిన అవసరముందని తెలిపారు. ఏడాది పాలనలో ప్రధాని మోడీ ప్రభుత్వం తెలంగాణకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కరోనా పరిస్థితుల్లో తీసుకున్న చర్యలపై జేపీ నడ్డా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెప్పారు.
వర్చువల్ ర్యాలీకి సంబంధించి వారం రోజులుగా శ్రేణుల్ని సన్నద్ధం చేసినట్టు బండి సంజయ్ తెలిపారు. టెలీ, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా సమాచారం చేరవేసినట్టు చెప్పారు. వర్చువల్ ర్యాలీపై గ్రామగ్రామాన అవగాహన కలిగించేందుకు కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఢిల్లీ నుంచి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర కార్యాలయం నుంచి తాను వర్చువల్ ర్యాలీలో పాల్గొంటున్నట్టు తెలిపారు బండి సంజయ్.