
- జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి
- ప్రొఫెసర్ జి.హరగోపాల్ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటించాలని, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణను ప్రోత్సహించే జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని ప్రొఫెసర్ జి.హరగోపాల్ డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో కేంద్రం10 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు విద్యకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతిపాదనను ఉపసంహరించుకొని, ప్రభుత్వ రంగంలోని 30 వేల స్కూళ్లను సమగ్రంగాఅభివృద్ధి చేయాలన్నారు.
టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను రద్దు చేసి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సెమీ- రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని కోరారు. అలాగే స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బదులుగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలను అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే నైపుణ్యాలను నేర్పించాలని సూచించారు. ప్రొఫెసర్ కె. చక్రధర్ రావు మాట్లాడుతూ.. శాస్త్రీయ విద్యను అందించే కామన్ స్కూల్ విద్యా విధానం కోసం ప్రజలందరూ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.