చెన్నూరు​లో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచుతున్నరు: ఓయూ జేఏసీ

చెన్నూరు​లో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచుతున్నరు: ఓయూ జేఏసీ
  • స్టూడెంట్స్​ను పోలీసులు వేధిస్తున్నరు
  • సీఈవో వికాస్ రాజ్​కు కంప్లైంట్

హైదరాబాద్/ మంచిర్యాల, వెలుగు: చెన్నూరు​లో విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంచుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓయూ జేఏసీ లీడర్లు సీఈవో వికాస్ రాజ్​కు సోమవారం కంప్లైంట్ చేశారు. అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరారు. సూర్యాపేట అభ్యర్థి జగదీశ్ రెడ్డి కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రచారానికి వెళ్తున్న ఓయూ స్టూడెంట్స్​కు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జేఏసీ లీడర్లు మీడియాతో మాట్లాడారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ స్టూడెంట్స్​పై స్థానిక పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్​కు పోలీసులు అనుకూలంగా పని చేస్తున్నారని ఓయూ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ జటంగి సురేశ్​యాదవ్ అన్నారు.

చెన్నూరులో ప్రచారానికి వెళ్లిన తమను పోలీసులు ఆపి.. ఆధార్, పాన్ కార్డులు కావాలంటూ ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. లోకల్ పోలీసులు బాల్క సుమన్​కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కేసులు పెడ్తామని బెదిరించారని చెప్పారు. కొంతమంది తమపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. యువకులకు మద్యం పంచి పెడుతూ.. వారి జీవితాలు నాశనం చేస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో బాల్క సుమన్ గెలుపు కోసం ప్రచారం చేశామని, ఇప్పుడు చెన్నూరుకు వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. సుర్యాపేటలో జగదీశ్​రెడ్డికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తూ స్టూడెంట్స్​పై అక్రమ కేసులు పెడ్తున్నారని తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగులతో డబ్బులు పంపిణీ చేయిస్తున్నడు : కాంగ్రెస్​

బీఆర్​ఎస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్.. ప్రభుత్వ అధికారుల ద్వారా ఓటర్లకు డబ్బు పంపిణీ చేయిస్తున్నారని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఈసీకి కంప్లైట్​ చేశారు. మంచిర్యాల, మందమర్రి, చెన్నూరు తదితర ప్రాంతాల్లో గవర్నమెంట్​ఆఫీసర్లతో డబ్బులు పంపిణీ చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ విప్​గా ఉన్న బాల్క సుమన్​కు డిప్యూటేషన్‌‌‌‌పై  వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్న అధికారులు ఎన్నికల కోడ్ ను​ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. ఎలక్షన్లలో భాగంగా వారిని సరెండర్​ చేయకుండా.. తనవద్దనే పెట్టుకున్నారని కంప్లైట్​లో పేర్కొన్నారు. వెంటనే బాల్క సుమన్​తో పాటు అతని వద్ద పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని వారు ఈసీని కోరారు.