హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మద్యం ధరలను అడ్డదారిలో పెంచేశారు. ఎమ్మార్పీ కంటే రూ. 5 నుంచి రూ. 30 వరకు ఎక్కువకు అమ్ముతున్నారు. ఇలా అమ్ముకునేందుకు అధికారులే అనధికారికంగా అనుమతులు ఇచ్చారని వైన్స్ వ్యాపారులు చెప్తున్నారు. బ్లెండర్స్ప్రైడ్ ఫుల్ బాటిల్ సాధారణ ధర వెయ్యి రూపాయలు ఉండగా.. ఇప్పుడు రూ. 1,030 వరకు తీసుకుంటున్నారు. సిగ్నేచర్ జనరల్ రేట్ రూ. 980 ఉండగా.. రూ. 1000, 1010కి అమ్ముతున్నారు. రాయల్స్టాగ్ సాధారణ ధర రూ. 600 ఉండగా, 630 వరకు అమ్ముతున్నారు. ఎంసీ, ఐబీ, ఏసీ, ఓసీలపై రూ. 20 పెంచేశారు. అయితే హాఫ్ బాటిల్కు రూ. 20, క్వార్టర్కు రూ. 10 చొప్పున అధికంగా తీసుకుంటున్నారు. ఇక బీర్లపై రూ. 10 అదనంగా పెంచారు. వోడ్కా, వైన్, విస్కీలపై రూ. 20వరకు పెంచారు.
రెన్యువల్ ఎఫెక్ట్
వాస్తవంగా రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు కావాలి. కానీ వివిధ కారణాలతో అది నవంబర్1కి వాయిదా పడింది. దీంతో మద్యం లైసెన్స్లను ప్రభుత్వం నెల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ ఒక్క నెలకు సరిపడా లైసెన్స్ ఫీజు చెల్లించి, మద్యాన్ని తీసుకోవచ్చని షాపుల యజమానులకు ప్రభుత్వం తెలిపింది. మొదటి ఇండెంట్ నుంచే 13.5 శాతం మేర ఎక్సైజ్ టర్నోవర్ ట్యాక్స్(ఈటీటీ)ను చెల్లించాలని, అలా చెల్లించిన వారికే మద్యం సరఫరా చేస్తామని పేర్కొంది. నిబంధనల ప్రకారం తాము చెల్లించే లైసెన్స్ ఫీజుకు ఏడు రెట్లు మద్యాన్ని లిఫ్ట్ చేసిన తర్వాతే ఈటీటీని వసూలు చేయాలని, మొదటి ఇండెంట్ నుంచే వసూలు చేస్తే తమకు మిగిలేది ఏమీ ఉండదని డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ సర్కార్ వెనక్కి తగ్గలేదు. దీంతో డీలర్లు లైసెన్స్ రెన్యువల్కు ముందుకు రాకపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముకున్నా పట్టించుకోబోమని, దసరా, దీపావళి పండుగలు వస్తున్నందున మంచి అవకాశాన్ని జార విడుచుకోవద్దని డీలర్లను వాళ్లు బుజ్జగించినట్లు తెలుస్తోంది. కొందరిని బలవంతం పెట్టినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అధికారులు ఇచ్చిన హామీతోనే తాము లైసెన్స్లు రెన్యువల్ చేసుకున్నామని, ఎక్కువ ధరలకు అమ్ముతున్నామని పలువురు డీలర్లు బహిరంగంగానే చెప్తున్నారు. మద్యం రేట్లు పెరిగినట్లు బోర్డులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ శాఖ మాత్రం అలాంటిది ఏమీ లేదని, ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.
ఎక్కువకు అమ్ముకోమన్నరు
కొత్త మద్యం పాలసీ ఆలస్యమవడంతో పాత లైసెన్స్లను ఒక నెల పొడిగించారు. దీంతో ఎంతో సంతోషపడ్డాం. కానీ సర్కారు ట్విస్ట్ ఇచ్చింది. మొదటి ఇండెంట్ నుంచే 13.5 శాతం మేర ఎక్సైజ్ టర్నోవర్ ట్యాక్స్(ఈటీటీ)ను చెల్లించాలంది. ఇలా అయితే మాకు నష్టాలే వస్తాయని లైసెన్స్కు ఆసక్తి చూపించలె. దీంతో ఎక్సైజ్ అధికారులు ఫోన్ చేసి రెన్యూవల్ చేసుకోవాలన్నారు. నష్టాల బారి నుంచి తప్పించుకోవడానికి అవసరమైతే ఎమ్మార్పీ రేట్లు పెంచుకోవాలన్నారు.
– ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ డీలర్
ఎక్కువ తీసుకుంటున్నం
నష్టాలు వస్తాయని చెప్పడంతో దసరా, దీపావళికి ఎక్కువ ధరకు అమ్ముకోవాలని చెప్పారు. దీంతో అందరం సిండికేట్ అయ్యాం. ఫలానా బాటిల్ ఫలానా రేటుకు అమ్మాలని తీర్మానించాం. ఒక్కో సీసాకు ఒక్కో రేటు నిర్ణయించాం. 5 నుంచి 30దాకా ఎక్కువ తీసుకుంటున్నం..
– ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఓ డీలర్
ఎక్కువ రేట్కు అమ్మితే చర్యలు
ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మాలని మేం నిర్ణయం తీసుకోలేదు. ఇలా ఎక్కడా అమ్మకూడదు. ఒక వేళ అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుం టాం. వారిపై కేసులు నమోదు చేస్తం.
– సోమేశ్కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎక్సైజ్ శాఖ
ఎక్కువ ధరకు అమ్మితే రూ.2 లక్షలు ఫైన్
దసరా పండుగ సందర్భంగా వైన్షాపుల యజమానులు ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మితే రూ.2 లక్షల ఫైన్ వేయడంతోపాటు వారం రోజులు షాపు లైసెన్స్ సస్పెండ్ చేస్తామని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్, నల్గొండ, వనపర్తి, నిజామాబాద్ జిల్లాల్లోని 8 వైన్ షాపుల్లో ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మినట్టుగా గుర్తించామని తెలిపింది. దసరా పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఏ వైన్ షాపు యజమాని ప్రయత్నించినా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎక్సైజ్ స్టేషన్లకు అదనంగా స్టేట్ టాస్క్ఫోర్స్ టీంలు నాలుగు, ఎన్ఫోర్స్మెంట్ టీంలు పది, డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ టీంలు 34 ఏర్పాటు చేశామని చెప్పింది. ఎమ్మార్పీకి మించి అమ్మే వ్యాపారులపై ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్లో స్టేట్ కంట్రోల్ సెంటర్తో పాటు పాత పది జిల్లాల్లో పది కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఫిర్యాదులు అందగానే దాడులు చేయాలని ఎస్హెచ్వోలు, జిల్లా ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది.
ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్లు
స్టేట్ కంట్రోల్ రూం: 040–-24733056
హైదరాబాద్: 040-–24746884
రంగారెడ్డి: 040–24600450
ఆదిలాబాద్: 08732–220229
నిజామాబాద్: 08762–237551
మెదక్: 08455–-271232
నల్గొండ: 08682–224271
మహబూబ్నగర్: 08542–242488
వరంగల్: 08702–577412
కరీంనగర్: 08782–262330
ఖమ్మం: 08742–224342