ఏపీలో 4 నుంచి మ‌ద్యం విక్ర‌యాలు

ఏపీలో 4 నుంచి మ‌ద్యం విక్ర‌యాలు

గ్రీన్, ఆరెంజ్ జోన్ల‌లో ఈ నెల 4 నుంచి మ‌ద్యం అమ్మ‌కాలు ప్రారంభించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే మే-17 వ‌ర‌కు పొడిగించిన‌ లాక్ డౌన్ పూర్త‌య్యేవ‌ర‌కు మ‌ద్యం షాపులు మాత్రమే తెర‌వాల‌ని.. బార్స్ అండ్ రెస్టారెంట్స్ తెర‌వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది. జోన్ల విషయంలో దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటే ఐదు జిల్లాలు రెడ్‌ జోన్‌ లో ఉన్నందున అక్కడ అమ్మకాలు జరగవు. మండలాలను యూనిట్‌గా తీసుకుంటే అన్ని జిల్లాల్లోనూ రెడ్‌ జోన్‌ మండలాలను  మినహాయించి మిగిలిన మండలాల్లో మద్యం విక్రయించే అవకాశముంది. దీనిపై నేడు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ గడువును కేంద్రం మరో రెండు వారాలపాటు పొడిగించిన విష‌యం తెలిసిందే. దీంతో మే 17 వరకు లాక్ ‌డౌన్ అమల్లో ఉండనుంది. రెడ్ జోన్లలో లాక్ డౌన్ కఠినంగా అమలు కానుండగా.. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా మందు బాబులకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. గ్రీన్ ,  ఆరెంజ్ జోన్ల పరిధిలోని పాన్ షాపులు, లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

మద్యం అమ్మకాలకు కేంద్రం నిబంధనలను విధించింది. షాపుల దగ్గర ఐదుగురి కంటే ఎక్కువగా ఉండొద్దని.. ఒక్కొక్కరి మధ్య రెండు గజాల దూరాన్ని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.కేంద్రం ఆదేశాలతో మే 4 నుంచి గ్రీన్ జోన్లలో లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. కానీ రాష్ట్రాలు కూడా దీనికి అంగీకారం తెలపాల్సి ఉంటుంది.