కోర్టు వాదనల్లో సాహిత్య వెలుగు

కోర్టు వాదనల్లో  సాహిత్య వెలుగు

న్యాయవాదులు, న్యాయమూర్తుల్లో  కవులు, రచయితలు తక్కువ. కానీ, చాలామంది న్యాయవాదులకి, న్యాయమూర్తులకి సాహిత్యం అంటే మక్కువ ఎక్కువ. సాహిత్యం మీద ఇష్టంవున్న న్యాయవాదులు కోర్టుల్లో వాదనలు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో కవితా చరణాలను ఉదహరిస్తూ ఉంటారు. మరి కొంతమంది చిన్న కథలనూ ఉదహరిస్తుంటారు. వాదనలలోనే కాదు, న్యాయమూర్తులకి, న్యాయవాదులకి మధ్య జరిగే సంభాషణల్లో కూడా కథలు,  కవిత్వమూ అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటుంది.  ఓ చిన్న కథ, కవిత్వం చేసే పని ఓ గంట ఉపన్యాసం కన్నా చాలా ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. ఒక గంట ఉపన్యాసంలో చెప్పే విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా ఓ చిన్న కథలో  చెప్పవచ్చు. 

కథ చెప్పేందుకు కొంతసమయం పడుతుంది. కానీ, కవిత్వానికి అంత సమయం పట్టదు. 

ఏ విషయం గురించైనా ఎంత సూటిగా, శక్తిమంతంగా చెప్పామనేది ముఖ్యం. అందుకోసం కొంతమంది కథను ఎంచుకోవచ్చు. మరికొంతమంది కవితా చరణాలని ఎంపిక చేసుకోవచ్చు. న్యాయమూర్తులు కూడా ఒక విషయాన్ని బలంగా చెప్పడం కోసం కవితా చరణాలను ఎంపిక చేసుకుంటారు. 

న్యాయమూర్తులకి కూడా భావోద్వేగాలు

న్యాయమూర్తులకి కూడా భావోద్వేగాలు ఉంటాయి. అవి మాటల రూపంలోనే కాదు. తీర్పుల్లో  కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. అందుకు వారు ఎంపిక చేసుకునే ప్రక్రియ కవితా చరణాలు. కొన్ని సందర్భాలలో  ఓ కథలోని కొన్ని పేరాలు, వాక్యాలు పేర్కొంటారు. తీర్పుల్లో  కవితా చరణాల గురించి మరోసారి చర్చిద్దాం. ఈసారి కోర్టుల్లో వాదనలు జరిగే క్రమంలో  జరిగిన కవితా చరణాలని, కథలని, వాక్యాలని పరిశీలిద్దాం. కోర్టుల్లో  కథల్లోని వాక్యాలని, కవితా చరణాలని ఉదహరించేటప్పుడు న్యాయవాదులు తీసుకునే సమయం తక్కువగా ఉండాలి. అంతేకాదు అవి విషయానికి దగ్గరగా ఉండాలి. సూటిగా, స్పష్టంగా కూడా ఉండాలి. అప్పుడే వాటిని న్యాయమూర్తులు వినడానికి ఇష్టపడతారు. వాళ్ళకేసుకి సంబంధించిన అంశానికి సంబంధించినదై ఉండాలి. కవితా చరణాలను చెప్పి తమకి అనుకూలంగా ఉన్న ఉత్తర్వులని పొందే అవకాశం ఉంటుంది. ఢిల్లీ హైకోర్టులో ఓసారి జరిగిన ఓ సంఘటనని ఈ సందర్భంగా ఉదహరిస్తాను. భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ టీఎస్. ఠాకూర్ అప్పుడు ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. నాజిమ్ వాజిరి అనే న్యాయవాది వాదిస్తున్న కేసుకు చాలా దూరంగా వాయిదా తేదీని ఇచ్చి న్యాయమూర్తి లంచ్​కి  బెంచి దిగి వెళ్తున్న క్రమంలో ఆ న్యాయవాది ఓ ఉర్దూ కవితలోని రెండు చరణాలని ఇలా చదివాడు. ‘కౌన్ జీతా హై తేరీ జుల్ఫ్ సర్ హెూనే తక్’ ‘నీ ప్రతి స్పందన కోసం అంతకాలం నేను వేచి ఉండలేను" అన్నది దాని సారాంశం. న్యాయమూర్తి ఠాకూర్ మళ్ళీ బెంచి మీదకు వచ్చి ఆ కవితలోని మొదటి చరణాలను చదవమని అడిగారు. అతను ఇలా చదివాడు. 'ఆకో బాహీయే ఇక ఉమ్ అసర్ హెూనే తక్' 'ప్రియురాలి నుంచి ప్రేమ పూర్వకమైన జవాబు రావడానికి చాలా సమయం పడుతుంది' అన్నది తెలుగు సారాంశం. ఈ కవితా చరణాలని విన్న న్యాయమూర్తి కేసుని దగ్గరగా అంటే ఆ తర్వాత వారానికి వేశారు.

‘మొన్న, నిన్న, నేడు, రేపు’.. ఓ కథ

చాలామంది న్యాయమూర్తులకి ఉర్దూ భాష పట్ల ఇష్టం ఎక్కువ. తెలుగు రాష్ట్రాలలో తెలుగుని, తెలుగులోని కవిత్వాలని, కథలని వాక్యాలని ఉదహరించి న్యాయమూర్తుల దృష్టిని ఆకర్షించవచ్చు. అయితే అలాంటి సందర్భాలు నా దృష్టికి తక్కువగా వచ్చాయి. ఉర్దూ కవితలని, ఇంగ్లీషు కవితలని ఉదహరించిన చాలా తీర్పులని నేను చూశాను. అదేవిధంగా తమిళ సినిమా పాటలని ఉదహరించిన తీర్పులని చూడటం జరిగింది. తెలుగు కవితలని, తెలుగు కథల్లోని వాక్యాలని ఉదహరించిన తీర్పులు నా దృష్టికి రాలేదు. కానీ, న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ హైదరాబాద్​హైకోర్టులో పనిచేస్తున్నప్పుడు నా కథలోని చివరి వాక్యాలని బెంచ్ మీద రెండు మూడు సందర్భాల్లో ఉదహరించారు. ఈ విషయం ఆయనే చెప్పారు. అదేవిధంగా అవి విన్న న్యాయవాద మిత్రులూ చెప్పారు. ఆ కథపేరు ‘మొన్న, నిన్న, నేడు, రేపు’. మద్యపాన నిషేధం ఉన్న రోజుల కాలం కథ అది.  ఓ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎల్లయ్య హోటల్ ఉంటుంది. అప్పటికింకా మద్యపాన నిషేధం రాలేదు. తెలంగాణ ప్రాంతంలో సారా అమ్మకాలు చేపట్టవద్దని నక్సలైట్లు ఓ ఫర్మానాని జారీ చేశారు. నక్సలైట్లకి భయపడి సారా అమ్మడాన్ని అందరూ ఆపేశారు. ధిక్కారాన్ని సహింతునా అని ప్రభుత్వం పోలీస్ స్టేషన్లలో  సారా ప్యాకెట్లు పెట్టి అమ్మించింది. సారా అమ్మడమే తమ జీవిత ధ్యేయంగా పోలీసులు మారిపోయినారు. ఎల్లయ్యకి ఇవ్వాల్సిన డబ్బుకిగాను సారా ప్యాకెట్లు ఇచ్చేవాళ్లు పోలీసులు. ఆ విధంగా ఎల్లయ్యకి సారా అలవాటైంది. ఎల్లయ్య హోటల్   రెడ్డి మిలటరీ హెూటల్​గా మారిపోయింది. 

తీర్పుల్లో ఎక్కువగా ఉర్దూ కవిత్వం

తీర్పుల్లో ఎక్కువగా కన్పించేది ఉర్దూ కవిత్వం. ఆ తరువాత షేక్​స్పియర్ కొటేషన్లు. చిన్న కథలు. ఇట్లా సాహిత్యం కూడా తీర్పుల్లో చోటు చేసుకుంటుంది. మనదేశంలోని కోర్టుల్లో జరుగుతున్న జాప్యానికి సంకేతంగా డికెన్స్ 'జార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డైస్ వర్సెస్ జార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డైస్' నవలని సుప్రీంకోర్టులోని ఓ బెంచి ఉదహరిస్తే మరో బెంచ్ మరో సందర్భంలో 'టేల్ ఆఫ్ టూ సిటీస్'లోని ఓ సందర్భాన్ని ఉదహరించడం జరిగింది. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి చట్టం మాత్రమే తెలిస్తే సరిపోదు. చాలా విషయాలు తెలిసి ఉండాలి. చాలావాటిమీద పరిజ్ఞానం ఉండాలి. వాటిని సందర్భోచితంగా ఉపయోగించాలి. అప్పుడే సమర్థవంతంగా ఉంటుంది. వాదనల్లో న్యాయవాదులు, న్యాయమూర్తులు , తీర్పుల్లో న్యాయమూర్తులు ఉపయోగించే అవకాశం ఉంటుంది. సాహిత్యం పట్ల అభిరుచివున్న న్యాయమూర్తులే కథలు, కవిత్వాలు, నవలలోని అంశాలని ప్రస్తావిస్తూంటారు.

మందు కొనండి..ప్రభుత్వాన్ని రక్షించండి

ఎన్టీఆర్​ పాలనలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చింది. తాగుడుకి అలవాటైన ఎల్లయ్య ఉరఫ్ ఎల్లారెడ్డికి ఏమీ ఫరక్ పడలేదు. డబ్బులిచ్చి డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్ సంపాదించి తాగేవాడు. ఎన్టీఆర్​ చిన్నల్లుడు అధికారం చేపట్టిన తరువాత లైసెన్సులు కూడా రద్దు చేశాడు. ఎల్లారెడ్డికి- కష్టకాలం మొదలైంది. పోలీసులకీ అయనకూ పడదు. మందు బాటిళ్లు దొరికాయన్న కేసులో ఎల్లారెడ్డి ఇరుక్కొని జైలుకి వెళ్తాడు. దీంతో మందు మానేశాడు. ఆ తరువాత నిషేధం ఎత్తేశారు. 'మందు కొనండి - ప్రభుత్వాన్ని రక్షించండి' అన్న ప్రకటనలు వచ్చేశాయి. ఈ మార్పులన్నింటినీ చూసి ఎల్లారెడ్డి మనస్సు మద్యంబుడ్డీ వైపు లాగడం మొదలవుతుంది. కానీ, జైలు జీవితం గుర్తుకొస్తుంది. మొన్న అలవాటు లేనప్పుడు బలవంతం పెట్టి కొనిపిచ్చారు. అలవాటు చేశారు. అలవాటైన తరువాత చాటుకు తాగినా కూడా కేసు పెట్టారు. డబ్బులు గుంజారు. ఈ రోజు మానేద్దామనుకుంటే తాగితే నేరం కాదంటున్నారు. మొన్న నేరం కాదు. నిన్న నేరం. మళ్లీ ఈ రోజు నేరం కాదు. ఇదేమీ న్యాయమో ఎల్లారెడ్డికి అర్ధం కాలేదు. రేపు సీసా దగ్గర లేకపోతే నేరం అంటారేమోనని భయం వేస్తుంది. ఎందుకైనా మంచిదని తన హెటల్​ను అక్కడి నుంచి వేరే సుదూర ప్రాంతానికి తరలిస్తాడు. ఇదీ కథ. 

             న్యాయమూర్తుల దృక్పథాన్ని మార్చే కవిత్వం

ఓసారి  న్యాయమూర్తి ఓ న్యాయవాది అప్పీలుని వింటూ షేక్​స్పియర్ హెన్రీ 6లోని వాక్యాలని ఉదహరించాడు. ఆ న్యాయవాది చెడు ప్రవర్తన గురించిన అప్పీలు అది. ఆ న్యాయవాది ప్రవర్తనపై విసుగు చెందిన న్యాయమూర్తి ఇలా అంటాడు. ‘మనం చెయ్యాల్సిన మొదటి పని న్యాయవాదులని చంపి వేయడం’.  ఇది షేక్​స్పియర్  మాట. న్యాయమూర్తులు, న్యాయవాదులు వాదనలు చెబుతున్న క్రమంలో, వింటున్న క్రమంలో కవితలని, వాక్యాలని ఉదహరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉదహరించడం వల్ల న్యాయవాదులు న్యాయమూర్తుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక విషయంలో న్యాయమూర్తుల దృక్పథాలని మార్చే అవకాశం కూడా ఉంది. కథల్లోని వాక్యాలు చెప్పినప్పుడు పేచీ లేదు. అవి సులువుగానే అర్థమవుతాయి. కవిత్వం అలా కాదు. అందుకని స్పష్టతవున్న కవితా చరణాలని ఉదహరించాల్సి ఉంటుంది. అయితే అందరు న్యాయమూర్తులు ఈ కవితా చరణాలు వినడానికి ఇష్టపడతారని కూడా చెప్పలేం. కొంతమంది ఇష్టపడకపోవచ్చు.

-  డా. మంగారి రాజేందర్,  జిల్లా జడ్జి (రిటైర్డ్)