దంపతుల మధ్య గొడవలెందుకొస్తాయి..? కౌన్సిలింగ్ సెంటర్లకు బాధిత జంటల క్యూ

దంపతుల మధ్య గొడవలెందుకొస్తాయి..? కౌన్సిలింగ్ సెంటర్లకు బాధిత జంటల క్యూ
  • ఇంతకూ.. ఇద్దరి మధ్య గొడవలెందుకు? 
  • దంపతుల్లో పెరుగుతున్న అనుమానాలు
  • ఏటా వెయ్యికి పైనే గృహ హింస కేసులు
  • హైదరాబాద్ సఖీ సెంటర్​కు  క్యూ కడుతున్న బాధిత జంటలు 
  • కౌన్సిలింగ్ తో ఒక్కటి చేసే ప్రయత్నాలు

హైదరాబాద్, వెలుగు: చిన్న చిన్న అనుమానాలే చినికి చినికి పెనుభూతంగా మారిపోయి.. భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తున్నాయి. ఆపై శారీరకంగా, మానసి కంగా వేధించడం వంటి పరిస్థితులకు దారితీస్తున్నాయి. సిటీలో ప్రతి ఏటా గృహహింస కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఐదేండ్ల కాలంలో హైదరాబాద్​జిల్లాలో 5, 068 గృహ హింస కేసులు నమోదయ్యాయి. 

వీటిలో ఎక్కువ దంపతుల మధ్య అనుమానంతో గృహహింసకు పాల్పడుతున్నారు. భర్త తాగొచ్చి భార్యను హింసించడం, అబద్దాలు చెప్పి పెండ్లి చేసుకోవడం, అనారోగ్య కారణాలతో తరచూ గొడవపడటం.. ఇలా పలు కారణాలుగా ఉంటున్నాయి. చాలామంది తల్లిదండ్రులు ఇరువైపులా సరైన విచారణ చేసుకోకుండానే తమ పిల్లలకు పెండ్లి చేస్తున్నారు. 

దీంతో పెండ్లి తర్వాత భర్తకు, భార్యకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం, భర్త తాగుబోతు అని తెలుసుకోవడం వంటివి తెలుస్తున్నాయి. జాబ్, చదువు గురించి కూడా అబద్దాలు చెప్పి పెండ్లి చేస్తున్నారు. పెండ్లి తర్వాత అసలు వాస్తవాలు బయట పడుతుండడంతో గొడవలకు దారి తీస్తూ.. కేసుల దాకా వెళ్తున్నాయని అధికారులు చెబుతున్నారు. 

కౌన్సిలింగ్​ చేసినా మార్పు రాకుంటే..

హైదరాబాద్​జిల్లాలో సఖీ నిర్వహణ బాధ్యతను దివ్య దిశ ఎన్ జీవో సంస్థ చూస్తోంది.  జిల్లా వెల్ఫేర్​ఆఫీసర్ కూడా కేసులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కాగా, సఖీ సెంటర్​కు వచ్చేవారికి ముఖ్యంగా వైద్యసాయం, తాత్కాలిక వసతి, కౌన్సిలింగ్, న్యాయ సహాయం, ఒకవేళ ప్రాణాపాయం ఉందంటే పోలీస్​ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. 

కౌన్సిలింగ్​చేసినా మార్పు రాకుంటే చట్ట ప్రకారం కేసు ఫైల్ చేస్తున్నారు. ఇక “దంపతులు మధ్య బంధం ఎంత బలమైందో.. అంతే సున్నితమైంది కూడా. చిన్నపాటి అనుమానం కూడా బలమైన బంధాన్ని  నిర్వీర్యం చేయగలదు. ఇద్దరూ ముందుగా ఈగోలు వదిలేయాలి. అడ్జస్ట్ అయితే కాపురంలో కలహాలు అనేవి రావు.’’ అని సఖీ సెంటర్​అధికారులు సూచిస్తున్నారు. కేంద్రానికి వచ్చే జంటలకు కౌన్సిలింగ్​చేస్తూ.. కలిసి ఉండాలనే ప్రయత్నిస్తామని చెబుతున్నారు.  

పేరెంట్స్​ జోక్యం వల్లే..

పేరెంట్స్, పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులే విడిపోవడానికి కారణం.  తమ పిల్లలకు పెండ్లి చేసేటప్పుడే పేరెంట్స్​అన్ని హెల్త్ చెకప్స్ చేయించాలి. అబ్బాయి, అమ్మాయి చేసే ఉద్యోగాల గురించి ఎంక్వైరీ చేయాలి. ముఖ్యంగా దంపతుల పర్సనల్ విషయాల్లో పేరెంట్స్​ఇన్వాల్వ్​కావొద్దు. అయితే జంటల మధ్య గొడవలు పెరిగే చాన్స్ ఉంటుంది.  భార్యభర్తలు ఈగోలు పక్కన పెట్టి, సర్దుబాటు చేసుకుంటే సగం ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. 

– గోల్కొండ అనితారెడ్డి, అడ్వకేట్, సఖీ సెంటర్​అడ్మిన్, హైదరాబాద్​

“ సిటీకి చెందిన ఓ జంటకు మూడేండ్ల కిందట పెండ్లి అయింది. కొన్నాళ్లుగా భర్తను భార్య అనుమానిస్తూ.. ఓ రోజూ అర్ధరాత్రి దాకా ఆన్​లైన్ లో ఉండడం చూసింది. దీంతో ఆమె భర్తతో గొడవ పెట్టుకుని, అతని ఫోన్ చేక్​ చేయగా ఓ అమ్మాయితో మాట్లాడుతున్నట్టు తేలింది. అయితే..  యువతిని ఆమె ఇంటికి పిలిపించి భర్తకు రాఖీ కట్టించింది. ఆ తర్వాత కొద్దిరోజులకు భార్యపై భర్తకు డౌట్ వచ్చింది. 

ఆమె ఫోన్​చెక్​చేద్దామనుకోగా లాక్​చేసుకుంది. అడిగినా అన్ లాక్ చేయట్లేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఓ రోజు భార్య గృహహింస కేసు పెట్టింది. దంపతులను సఖీ సెంటర్ నిర్వాహకులు పిలిచి..ఇద్దరూ తమ ఫోన్లను ఒకరికొకరు చూసేకునేలా ఉండాలని అవగాహన కల్పించి కౌన్సిలింగ్​చేశారు. ప్రస్తుతం వీరి సంసారం సాఫీగా సాగుతోంది.’’ 

 “ సిటీకి చెందిన మరో జంటకు ఏడాది కిందట పెండ్లి అయింది. కాగా.. ఇద్దరూ అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. ఓ ప్రైవేట్​కంపెనీలో భార్య సేల్స్ గర్ల్ గా చేస్తుండగా.. అక్కడ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్టు భర్త అనుమానించి గొడవ పెట్టుకున్నాడు. అతను ఫ్రెండ్​మాత్రమేనని, ఎలాంటి రిలేషన్ లేదని భార్య చెప్పినా అర్థం చేసుకోలేదు. అయినా.. దంపతుల మధ్య  గొడవలు ఆగలేదు.  

దీంతో మానసికంగా, శారీరకంగా భర్త వేధిస్తున్నాడని ఆమె సఖీ సెంటర్ లో ఫిర్యాదు చేసింది. నిర్వాహకులు దంపతులను పిలిచారు.  ఇద్దరి మధ్య గొడవలకు కారణం.. రిలేషన్ షిప్ లో గ్యాప్​పెరగడమేనని చెప్పి కౌన్సిలింగ్​చేశారు. రెండు నెలలు టైమ్ ఇచ్చారు. అయినా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా అధికారులు కేసు నమోదు చేశారు.’’ 

  • సంవత్సరం        సఖీ సెంటర్ లో   నమోదైన కేసులు 
  • 2019       427
  • 2020      906
  • 2021      972
  • 2022      1,157
  • 2023      1,038
  • 2024(జూన్​ వరకు)  568