బషీర్బాగ్, వెలుగు: ఓ బాధితుడి పేరుపై అతనికి తెలియకుండానే లోన్స్ తీసుకొని, ఆ డబ్బులను స్కామర్స్ వారి ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతానికి చెందిన 40 ఏండ్ల బాధితుడి మొబైల్కు అతనికి అకౌంట్ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి రెండు మెసేజ్ లు వచ్చాయి. అందులో ఇన్స్టంట్లోన్, జంబో లోన్స్ ద్వారా మొత్తం రూ.3.91 లక్షలు అకౌంట్లో క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. బాధితుడు తన అకౌంట్ చెక్ చేయగా రూ.4 లక్షల బ్యాలెన్స్ కనిపించింది.
తాను ఎలాంటి లోన్స్అప్లై చేయలేదని బ్యాంక్ అధికారులకు కాల్ చేసి ఫిర్యాదు చేయబోగా, మరోసారి ఆ మొత్తం డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కొన్నిరోజుల కింద తెలియని నంబర్ నుంచి ఆర్టీవో చలాన్పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ను ఫోన్ లో ఇంస్టాల్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు.
దీంతో స్కామర్స్ తన ఫోన్ను హ్యాక్ చేసి, లోన్ తీసుకొని, ఆ డబ్బులను బదిలీ చేసుకున్నట్లు గుర్తించాడు. అనంతరం బాధితుడు తన ఫోన్ ను ఫార్మాట్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడుతో ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.
