సిద్దిపేట రూరల్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్కు అంగన్వాడీల ఆకలి కేకలు వినిపించడం లేదా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆయనను అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ స్కూళ్ల పేరుతో అంగన్వాడీ వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.
అనంతరం సిద్దిపేట మీలాన్ గార్డెన్లో సిద్దిపేట పౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాల పంపిణీ చేశారు. అనంతరం నారాయణరావుపేట మండలం గుర్రాలబొంది గ్రామంలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ దేవాలయం సిద్దోగం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కృషి ఫలితమే పచ్చని పంట పొలాలని, కేసీఆర్ రైతుబంధు తేస్తే కాంగ్రెస్ దానిని బంద్ చేస్తోందన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని క్యాసారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు.
