ఆన్​లైన్​ గేమ్స్​ కోసం అప్పులు? ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ఆన్​లైన్​ గేమ్స్​ కోసం అప్పులు? ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పిల్లలను నీటి సంపులో తోసిన తల్లి తర్వాత తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..మల్లికార్జున్​నగర్​కు చెందిన అవిశెట్టి మల్లేశ్ ​లారీ డ్రైవర్. ఇతడికి భార్య రాజేశ్వరి (28), పిల్లలు అనిరుధ్(5), హర్షవర్ధన్ (2) ఉన్నారు. మంగళవారం సాయంత్రం భర్త ఇంట్లో లేనప్పడు ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసిన రాజేశ్వరి.. తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన చుట్టుపక్కల వారు పిలవగా స్పందించలేదు. దీంతో చూడగా సంపులో ముగ్గురూ తేలుతూ కనిపించారు. దీంతో ఆమె భర్తకు సమాచారమిచ్చారు. వెంటనే మల్లేశ్​ ఇంటికి వచ్చి ముగ్గురి మృతదేహాలను బయటికి తీసి పోలీసులకు చెప్పాడు.  

ఆన్​లైన్ ​గేమ్స్​తోనే : స్థానికులు

రాజేశ్వరి  మొబైల్​లో ఎప్పుడూ లూడో  గేమ్స్​ఆడుతూ ఉండేదని, ఈ క్రమంలో రూ.4 లక్షల వరకు బంధువుల దగ్గర అప్పు తీసుకుందని స్థానికులు చెబుతున్నారు. గేమ్స్​లో అవి పోవడంతో అప్పు ఇచ్చినవారు  ఒత్తిడి చేయడం ప్రారంభించారని, అప్పు తీర్చే దారి లేక పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.