మహబూబ్‌నగర్ జిల్లా : పల్లెల్లో మొదలైన గ్రూపు రాజకీయాలు!

మహబూబ్‌నగర్ జిల్లా : పల్లెల్లో మొదలైన గ్రూపు రాజకీయాలు!
  • ఓటు బ్యాంకు ఉన్న లీడర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఆశావహులు
  • రిజర్వేషన్  తమకే అనుకూలంగా వస్తుందని ధీమా
  • అనుచరులను తీసుకెళ్లి మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద బల ప్రదర్శన

మహబూబ్​నగర్, వెలుగు: గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్​లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్​కు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నాలుగు రోజులుగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడికి వెళ్లినా ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఆశావహులు మాత్రం ‘ఎన్నికల్లో పోటీలో ఉండేది మేమే’ అంటూ ఊళ్లల్లో చెప్పుకుంటున్నారు.

అందిరినీ కలుపుకుపోతున్న లీడర్లు..

లోకల్​ బాడీస్​ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుండటంతో పోటీ చేయాలనుకుంటున్న లీడర్లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నాలుగు రోజుల నుంచి గ్రామాల్లో హడావుడి చేస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేల కార్యక్రమాలు ఉంటే.. అక్కడ హైలెట్​ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా వారి కేడర్​ను కార్యక్రమాల వద్దకు తీసుకొచ్చి.. వారి పేర్లతో జై కొట్టించుకుంటున్నారు. తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో ఓటు బ్యాంక్​ ఉన్న నాయకులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో ఆ లీడర్లకు మధ్య వారికి కొంత గ్యాప్​ ఉన్నా.. వాటిని పక్కన పెట్టేసి ఎన్నికల్లో తమ గెలుపు కోసం సహకరించాలని కోరుతున్నారు. 

వారిని ఫామ్​ హౌస్​లు, వ్యవసాయ క్షేత్రాలు, గ్రామ దేవతల జాతర్లు జరిగే ప్రాంతాలకు పిలిపించి గ్రాండ్​గా దావత్​లు ఇస్తున్నారు. పనిలో పనిగా.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉండే లీడర్లనూ కలుస్తున్నారు. ఫలానా సీటుకు తమ పేర్లను సిఫార్సు చేయాలని లాబీయింగ్​ మొదలు పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు ఉన్న లీడర్లు నేరుగా ఫలానా సీటు తమకే కేటాయించాలనే డిమాండ్​ను తెరమీదకు తీసుకొస్తున్నారు. గ్రామాల్లో రానున్న ఎన్నికల్లో పోటీలో ఉండేది తామేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు..

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో ఎంపీటీసీ స్థానాలు తగ్గనున్నాయి. కొత్త మున్సిపాలిటీలు, మండలాలు ఏర్పాటు కావడంతో ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. ఇటీవల మహబూబ్​నగర్  గ్రేడ్–1 మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​ కావడంతో కొన్ని గ్రామాలు ఈ కార్పొరేషన్​లో విలీనం అయ్యాయి. గతంలో మహబూబ్​నగర్​ జిల్లాలో 14 మండలాలకు 184 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. మహబూబ్​నగర్​ కార్పొరేషన్​గా ఏర్పాటు కావడం, కౌకుంట్ల, మహమ్మదాబాద్​ కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో.. ప్రస్తుతం 14 మండలాల్లో 175 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి.

 అయితే ​ఇటీవల దేవరకద్ర కూడా మేజర్​ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్​గ్రేడ్​ కావడంతో మరో మూడు స్థానాలు తగ్గే అవకాశం ఉంది. నారాయణపేట జిల్లాలోని 13 మండలాలకు 136 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అయితే ఇటీవల మద్దూరు మేజర్​ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్​గ్రేడ్​ చేశారు. దీంతో ఈ జిల్లాలో కూడా రెండు ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా ఉంటాయనే దానిపై అధికార పార్టీ లీడర్లు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పని చేస్తున్న వారు రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరు మండలాల్లో గ్రౌండ్​ వర్క్​ చేసుకుంటున్నారు. వారి కేడర్​ను సిద్ధం చేసుకున్నారు. రిజర్వేషన్లు కలిసొస్తే వీరిని అదృష్టం వరించనుండగా.. మారితే మాత్రం పోటీలో కొత్త వారు లేదా జూనియర్​ లీడర్లు తెరమీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.