- కలెక్టర్లు వస్తుంటారు పోతుంటారు.. మేం లోకల్ అంటున్న కొందరు ఉద్యోగులు
- కలెక్టర్ ఎవరైనా చక్రం తిప్పేది వాళ్లే
- ట్రాన్స్ఫర్ల నుంచి భూరికార్డుల్లో మార్పుల వరకు అన్నీ వాళ్ల చేతుల్లోనే
- ఇప్పటికే కొందరిపై క్రిమినల్ కేసులు
కరీంనగర్, వెలుగు:కరీంనగర్ కలెక్టరేట్లో కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి తిష్టవేశారు. కలెక్టర్లు వస్తుంటారు.. పోతుంటారు తాము మాత్రం కరీంనగర్ లోనే ఉంటామనే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు సీసీలు, తహసీల్దార్ స్థాయి అధికారులు ఉండగా.. రెవెన్యూ, సివిల్ సప్లై, పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్.. ఇలా ఏ డిపార్ట్మెంట్లో అవినీతి, అక్రమాలు జరిగినా అన్నింట్లోనూ వీళ్లే చక్రం తిప్పుతారనే పేరుంది. అవినీతి ఉద్యోగులకు అభయం ఇవ్వడం, చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులను మేనేజ్ చేయడం వీరికి ‘మామూలై’పోయింది.
ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, డిప్యుటేషన్లు మొదలు భూభారతి దరఖాస్తుల ప్రాసెస్, సీఎంఆర్ రికవరీ, అవినీతి ఆఫీసర్లపై వచ్చే ఫిర్యాదులు, ఎంక్వైరీ వరకు అన్నింట్లోనూ సదరు అధికారులే కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారిని మార్చకుండా కలెక్టరేట్ను ప్రక్షాళన చేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది.
ఏళ్ల తరబడి కలెక్టరేట్లోనే
కొందరు రెవెన్యూ ఆఫీసర్లు కరీంనగర్ జిల్లాను ఏళ్ల తరబడి వీడడం లేదు. ఇదే జిల్లాలో కింది స్థాయి ఆఫీసర్గా చేరి ఉన్నత స్థానానికి చేరిన జిల్లాలో ఉంటున్నారు. మరికొందరైతే కలెక్టరేట్ దాటి అడుగుబయటపెట్టడం లేదు. ఏళ్ల తరబడి సీసీలుగా కుర్చీని వదలడం లేదు. తమపై ఆఫీసర్లు ఐఏఎస్లు అయినా సీసీలే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారనే ప్రచారం ఉంది. ఓ తహసీల్దార్ స్థాయి ఆఫీసర్ అయితే కరీంనగర్ను ఏళ్లుగా వీడడం లేదు. కరీంనగర్ అర్బన్, రూరల్ తహసీల్దార్ ఆఫీసులు, లేదంటే కరీంనగర్ కలెక్టరేట్కే పరిమితవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జిల్లాలో తహసీల్దార్లందరికీ స్థానచలనం కలిగినా సదరు తహసీల్దార్ కలెక్టరేట్కే పరిమితం కావడం గమనార్హం. ఏకంగా తప్పుడు పద్ధతిలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడం, ఓ తహసీల్దార్ భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేసి సదరు ఆఫీసర్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూనే ఎలాంటి సస్పెన్షన్లు లేకుండా కలెక్టరేట్లోనే కొనసాగుతున్నారు.
కలెక్టరేట్లో సీసీగా పనిచేసే మరో తహసీల్దార్ స్థాయి ఆఫీసర్.. కారుణ్య నియామకంలో జూనియర్ అసిస్టెంట్గాఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత డీటీగా, తహసీల్దార్గా ప్రమోషన్ పొందారు. ఆయన దశాబ్దంన్నర కాలంగా కలెక్టరేట్లో ఓ ఐఏఎస్ ఆఫీసర్ వద్ద సీసీగా పనిచేస్తూ కుర్చీని వదలడం లేదు. ఆ మధ్య జిల్లాలో కీలకమైన మండలానికి తహసీల్దార్గా ట్రాన్స్ఫర్ కాగా.. తగినంతగా ఇంగ్లీష్ రాకపోవడం, ఉన్నతాధికారులకు రిపోర్టులు ప్రిపేర్ చేయడంలో ఇబ్బందులతో రెండు నెలలు తిరకగముందే మళ్లీ కలెక్టరేట్కు చేరుకున్నాడు. తనకు అవసరమైన ఫైళ్లను తాను పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్ ముందు పెట్టడం, నచ్చని ఫైళ్లను తొక్కిపెట్టడం, సదరు ఆఫీసర్ను ఎవరు కలవాలో..? ఎవరు కలవద్దనే విషయాలను ఆయన చూస్తారనే పేరుంది. అంతేగాక తనకంటే సీనియర్లయిన ఆఫీసర్లను కూడా బెదిరింపులకు గురిచేస్తారనే ఆరోపణలు
ఉన్నాయి.
శ్రవణ్ కుమార్ అవినీతికి బీజం పడింది కరీంనగర్లోనే..
తాజాగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన సిద్ధిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ శ్రవణ్కుమార్ అవినీతి ప్రస్థానం కరీంనగర్ జిల్లాలో, అందునా కలెక్టరేట్ నుంచే ప్రారంభమైందనే చర్చ జరుగుతోంది. ఏసీబీ సోదాల్లో కోట్లాది రూపాయల ఆస్తులను గుర్తించడంతో శ్రవణ్ కుమార్ గతంలో కరీంనగర్ కలెక్టర్ సీసీగా పనిచేసిన విషయాన్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన అవినీతికి అప్పట్లోనే బీజం పడిందని, ట్రాన్స్ఫర్లు, ఎంక్వైరీలు, డిప్యూటేషన్లతోపాటు కలెక్టర్ ఆఫీసుతో ముడిపడి ఉన్న పనులకు వసూళ్లకు పాల్పడేవాడనే ఆరోపణలు అప్పటి నుంచే ఉన్నాయని తెలిపారు.
