హిండెన్ బర్గ్ ఆరోపణలు.. సెబీ మాజీ చీఫ్కు లోక్ పాల్ క్లీన్ చిట్..

హిండెన్ బర్గ్ ఆరోపణలు.. సెబీ మాజీ చీఫ్కు లోక్ పాల్ క్లీన్ చిట్..

హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఆరోపణల వ్యవహారంలో  సెబీ (SEBI) మాజీ చైర్ పర్సన్ మాధవి పురి బుచ్ కు లోక్ పాల్ క్లీన్ చిట్ ఇచ్చింది. హిండెన్ బర్గ్ ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఆరోపణలు  రాజకీయ ప్రేరేపితమైనవిగా ఈ సందర్భంగా లోక్ పాల్ పేర్కొంది. 

2024 ఆగస్టు లో అమెరికా షార్ట్ సెల్లర్- హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ మాధవి పురి బుచ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయ తెలిసిందే. షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అదానీ గ్రూప్ కంపెనీల్లో మాధవి పురి బచ్, ఆమె భర్త పెట్టుబడులు పెట్టారని ఆ సంస్థ ఆరోపించింది. దీనిపై దేశ వ్యాప్తంగా అప్పట్లో రాజకీయ దుమారం చెలరేగింది. 

మోదీ స్నేహితుడైన అదానీకి మేలు చేసేందుకు మాధవి పురి బుచ్ నిబంధనలను ఉల్లంఘించిందని అప్పట్లో కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. ఇన్ సైడర్ ట్రేడింగ్, నిధుల మళ్లింపు, కార్పోరేట్ ఎంటిటీస్ కు లాభం కలిగించేలా వ్యవహరించారని, చర్యలు తీసుకోవాలని తీవ్ర విమర్శలు వచ్చాయి.

అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు మారిషస్‌కు చెందిన కొన్ని ఫండ్లను ఉపయోగించారని, ఈ ఫండ్లలో మాధవి పురీ బచ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా గత సంవత్సరం లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేశారు.

మహువా మొయిత్రా చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన లోక్‌పాల్, తాజాగా తన తీర్పును వెలువరించింది. మాధవి పురీ బుచ్‌పై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. దీంతో, ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

మాధవి హయాంలో వచ్చిన ముఖ్యమైన మార్పులు:

ఇండియన్ స్టాక్ మార్కెట్ లో T+1 సెటిల్ మెంట్ (ట్రేడ్ చేసిన రోజే స్టాక్స్ లేదా డబ్బులు అకౌంట్లోకి రావడం), ASBA విధానంలో కచ్చితత్వం ( ఏదైనా IPO కి అప్లై చేసినపుడు అది ప్రాసెస్ అయిన తర్వాతనే అకౌంట్ లో డబ్బులు బ్లాక్ అవ్వడం), చార్జెస్ మోసాలకు అడ్డుకట్ట (ఇన్వెస్టర్ల నుంచి ఎక్స్ చేంజ్ చార్జీలు వసూలు చేసే బ్రోకరేజ్ కంపెనీలు.. ఆ చార్జీలను ఎక్స్చేంజ్ కు ఇవ్వకపోవడం) మొదలైన సంచలన నిర్ణయాలతో మార్కెట్ ను కొత్త పుంతలు తొక్కించారు. 

సెబీ చీఫ్ గా కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. కంపెనీలకు పరోక్షంగా సహకారం అందించారని, దాని వల్ల కంపెనీలు, కార్పోరేట్లు లాభపడ్డారని, కానీ ఇన్వెస్టర్లు నష్టపోయారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. అందులో భాగంగా ఆమెపై దాఖలైన పిటిషన్ ఆధారంగా విచారణకు ఆదేశించింది స్పెషల్ కోర్టు.