క‌రోనా వైర‌స్‌ను పంపింది కృష్ణ భ‌గ‌వానుడే: కాంగ్రెస్ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

క‌రోనా వైర‌స్‌ను పంపింది కృష్ణ భ‌గ‌వానుడే: కాంగ్రెస్ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్‌ను భూమిపైకి కృష్ణ భ‌గ‌వానుడే పంపాడ‌ని ఉత్త‌రాఖండ్ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు సూర్య‌కాంత్ ధ‌స్మాన అన్నారు. ఓ టీవీ చానెల్ డిబేట్‌లో పాల్గొన్న ఆయ‌న ఈ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా వైర‌స్, కృష్ణుడి పేరు… రెండూ క అక్ష‌రంతోనే మొద‌ల‌వుతాయ‌ని, అందుకే కృష్ణుడు ఈ వైర‌స్‌ను పంపాడంటూ కామెంట్ చేశారు. అయితే ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క‌రోనా మ‌హ‌మ్మారికి దేవుడి పేరుతో లింక్ చేయ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ ట్విట్ట‌ర్‌లో ఆయ‌న‌పై ఫైర‌య్యారు. కాంగ్రెస్ నేత‌లకు హిందూ దేవ‌త‌ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం అల‌వాటేనంటూ ప‌లువురు నెటిజ‌న్లు త‌ప్పుబ‌ట్టారు. కాంగ్రెస్ కూడా క అక్ష‌రంతోనే మొద‌ల‌వుతుంద‌ని, క‌రోనా కంటే కాంగ్రెస్ మ‌రింత వ‌ర‌స్ట్ వైర‌స్ అని మ‌రో నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. చైనాతో కాంగ్రెస్‌కు ఉన్న రిలేష‌న్ ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో అర్థ‌మైపోతోంద‌ని మ‌రికొంద‌రు కామెంట్ చేశారు.

వివాదాస్ప‌దం కావ‌డంతో వివ‌ర‌ణ‌

కాంగ్రెస్ నేత సూర్య‌కాంత్ వ్యాఖ్య‌లు వివాస్ప‌దం కావ‌డంతో ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీకృష్ణుడు సృష్టికి మూలం తానేన‌ని చెప్పాడ‌ని, ఈ విశ్వంలో ప్ర‌తిదీ త‌న సంక‌ల్పంతోనే జ‌రుగుతుంద‌ని చెప్పాడ‌న‌ని అన్నారు. దీనినే తాను ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాన‌ని, కృష్ణ భ‌గ‌వానుడికి తెల‌య‌కుండానే క‌రోనా పుట్టిందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీకరించార‌ని, భ‌గ‌వంతుడి నిర్ణ‌యంతో ఈ సృష్టిలో ప్ర‌తిదీ జ‌రుగుతుంద‌ని చెప్ప‌డ‌మే త‌న ఉద్దేశ‌మ‌న్నారు.