ఓయో లాడ్జిలో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. యువ‌తి మృతి

ఓయో లాడ్జిలో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. యువ‌తి మృతి

మేడ్చ‌ల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఫరిదిలో విషాదం జ‌రిగింది. మేడిప‌ల్లిలోని స్థానికంగా ఉన్న ఓయో లాడ్జి  రూమ్ లో ఓ ప్రేమ‌జంట‌ ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘ‌ట‌న‌లో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, యువకుడు ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈనెల 14న మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఫరిదిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మేడిపల్లిలోని OYO రూమ్స్ లో శ్రావణి, అజయ్ అనే ప్రేమ జంట పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించారు… పీర్జాదిగుడాకు చెందిన శ్రావణి, ఉప్పల్ లోని బజాజ్ షోరూమ్ లో సూపర్ వైజర్ గా పని చేసే అజయ్ గ‌త కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ‌కు యువతి తల్లిదండ్రులు అంగీకరించినప్పటికి, అబ్బాయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంగీకరించ పోవడంతో ఇద్దరు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ ఘ‌ట‌న‌లో శ్రావణి అక్కడికక్కడే మృతి చెందగా… కొనఊపిరితో ఉన్న అజయ్ ని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వీరి ఆత్మహత్య పలు అనుమానాలకు దారి తీస్తోంది. కరోనా టైంలో OYO సంస్థ లాడ్జిలు నడిపేందుకు అనుమతులు ఉన్నాయా? లాడ్జి లో నే వీరు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు? అసలు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేదంటే ప్రేమోన్మాదంతో యువకుడే ఆ అమ్మాయిని బలవంతంగా పురుగుల మందు తాగించి, తాను సేవించాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.