- ఎల్పీజీ కొరతతో ఇండక్షన్ స్టవ్ల వైపు పబ్లిక్ మొగ్గు
- గడిచిన ఐదారు రోజుల్లో 30 శాతానికి పైగా పెరిగిన కొనుగోళ్లు
- ఈ కామర్స్ సైట్లలో ‘నో స్టాక్’
హైదరాబాద్, వెలుగు: ఎల్పీజీ గ్యాస్ కొరతతో రాష్ట్రంలో కరెంట్పొయ్యిలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇరాన్, ఇజ్రాయెల్–అమెరికా యుద్దం వల్ల పశ్చిమాసియా నుంచి పెట్రోలియం, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఎల్ పీజీ సిలిండర్లకు కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్లకు మాత్రమే పరిమితులు విధిస్తున్నామని, డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా యథావిధిగా కొనసాగుతుందని కేంద్రం చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
రీఫిల్బుకింగ్కు ఇబ్బందులు ఎదురవుతుండడం, సిలిండర్లను ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తుండడంతో ప్రజలు అలర్ట్అయ్యారు. ఓవైపు రీఫిల్ బుకింగ్లు చేస్తూనే ముందుజాగ్రత్తగా ఇండక్షన్ స్టవ్(ఎలక్ట్రికల్ స్టవ్)లను కొనుగోలు చేస్తున్నారు.గత ఐదారు రోజులుగా వీటి కొనుగోళ్లు 30 శాతానికి పైగా పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. అటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్వంటి ఈ కామర్స్సైట్లు, ఇతర ఆన్లైన్ప్లాట్ ఫామ్స్లోనూ నో స్టాక్మెసేజ్లు దర్శనమిస్తున్నాయి. ఆఫ్లైన్ స్టోర్లలోనూ ఇదే పరిస్థితి ఉండడాన్ని బట్టి ప్రజలు గ్యాస్ కొరతపై ఎంతలా ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోంది.
పల్లె, పట్నం తేడా లేకుండా..
రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ కుటుంబాలు అన్నం వండటానికి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను వాడుతున్నారు. సుమారు 60 శాతం ఇండ్లలో వీటిని వినియోగిస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. ఎలక్ట్రిక్ కుక్కర్లు గతంలో సిటీలు, టౌన్లకే పరిమితమైనప్పటికీ 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ స్కీం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ కుక్కర్ల వాడకం పెరిగింది. టీ, టిఫిన్, కూరల కోసం మాత్రమే గ్యాస్ స్టవ్లను ఉపయోగిస్తున్నారు.
అయితే, ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ కొరత వల్ల ముందు జాగ్రత్తగా ఇండక్షన్ స్టవ్లు కొంటున్నట్లు తెలుస్తోంది. మారిన పరిస్థితుల్లో పల్లెల్లోనూ చాలావరకు కట్టెల పొయ్యిలు తగ్గిపోయాయి. దీంతో సిలిండర్ఖాళీ అయితే ఒక్క పూట కూడా వంట చేయలేని పరిస్థితి. అందుకే ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్లను కొంటున్నారు. మోడల్ను బట్టి రూ.1,500 నుంచి రూ.4 వేల లోపే లభిస్తుండడం, ఫ్రీ కరెంట్ కావడంతో కొనేస్తున్నారు.
గృహజ్యోతి వినియోగదారులే ఎక్కువ
రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లలోపు కరెంట్ఉపయోగించే తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఉచిత కరెంట్సరఫరా చేస్తున్నది. ఈ కుటుంబాల నెలవారీ కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 52.82 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ప్రస్తుత గ్యాస్ కొరత నేపథ్యంలో ఈ కుటుంబాల్లో ఎక్కువ మంది ఎలక్ట్రికల్ స్టవ్లు కొనుగోలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
పేద, మధ్య తరగతి కుటుంబాలు నెలంతా కరెంట్ యూజ్ చేసినా 100 యూనిట్లలోపే కాలుతున్నది. ఎండాకాలం రావడంతో వాటర్ హీటర్ల వినియోగం కూడా తగ్గింది. దీంతో ఎలక్ట్రికల్ స్టవ్లపై వంట చేసుకుంటే తమకు గ్యాస్ సిలిండర్ల ఖర్చు తగ్గుతుందని భావిస్తున్నారు.
