రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్​ను నియమించిన కేంద్ర ప్రభుత్వం

రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్​ను నియమించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌(సీడీఎస్)గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (61) నియమితులయ్యారు. ఇంతకుముందు సీడీఎస్ గా ఉన్న జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో తొమ్మిది నెలల నుంచీ ఈ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆర్మీలో దాదాపు 40 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన చౌహాన్​ను కొత్త సీడీఎస్ గా కేంద్రం బుధవారం నియమించింది. సీడీఎస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి, మిలిటరీ వ్యవహారాల శాఖకు సెక్రటరీగా కూడా చౌహాన్ వ్యవహరిస్తారు. అనిల్ చౌహాన్ ప్రస్తుతం జాతీయ భద్రతామండలిలో మిలిటరీ సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే, రిటైర్డ్ ఆఫీసర్​ను సీడీఎస్​గా నియమిస్తున్నందున ఈ మేరకు రూల్స్ ను మారుస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

టెర్రర్ గ్రూపుల అణచివేతలో ఎక్స్ పర్ట్ అనిల్ చౌహన్1961 మే 18న జన్మించారు. 1981లో 11 గుర్ఖా రైఫిల్స్ లో చేరారు. 2019 సెప్టెంబర్ లో ఈస్ట్రన్ ఆర్మీ కమాండ్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2021 మే నెలలో రిటైర్ అయ్యే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగారు. జమ్మూ కాశ్మీర్ సహా ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు గ్రూపులను నిరోధించడంలో చౌహాన్ కు విశేష అనుభవం ఉంది. సైన్యంలో తన సేవలకు గాను ఆయన పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం సహా పలు మెడల్స్ అందుకున్నారు. త్రివిధ దళాలను ఏకతాటిపైకి తేవాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ (సీడీఎస్) పోస్టును క్రియేట్ చేసింది. దేశ తొలి సీడీఎస్ గా జనరల్ బిపిన్ రావత్ 2020 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అయితే 2021 డిసెంబర్ 8న జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో రావత్​ మరణించారు.