గ్రహణం ఎఫెక్ట్: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. మార్చి 1,2 తేదీల్లో SSD టోకెన్లు రద్దు

 గ్రహణం ఎఫెక్ట్: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. మార్చి 1,2 తేదీల్లో SSD టోకెన్లు రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్​అలెర్ట్​ జారీ చేసింది.  మార్చి 3 వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ముందు రెండు రోజులు అంటే మార్చి 1,2 తేదీల్లో SSD టోకెన్లు రద్దుచేసింది.  మార్చి 3 వ తేది దేవాలయం ఏ సమయంలో మూసి వేస్తారో తెలిపింది. 

మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణం నేపథ్యంలో దర్శనాలు, టోకెన్ల జారీ, ఆర్జిత సేవలు, అన్నప్రసాద వితరణతో పాటు అనేక సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది టీటీడీ. 

మార్చి 1,2 , 3 తేదీలలో శ్రీవారి దర్శనాలకు సంబంధించి టైమ్ స్లాటెడ్ సర్వదర్శన్ (SSD) టోకెన్లు జారీని నిలిపివేశారు.  మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను మాత్రం మార్చి 3న జారీ చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. 

మార్చి 3న  చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. ఆనవాయితీ ప్రకారం గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగానే ఆలయ తలుపులు మూసివేయబడతాయి. సాయంత్రం 7.30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి శుద్ధి, పుణ్యహవచనం మొదలగు ప్రక్షాళన  నిర్వహించిన అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కలుగజేస్తారు. 

 మార్చి 3న నిర్వహించాల్సిన అష్టదళ పాదపద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు.  వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా నిలిపివేశారు. మార్చి 2న వీఐపీ దర్శన సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోమని టీటీడీ ప్రకటించింది.