ఎఫ్ఇండియా, ‘మాలక్ష్మి’ మధ్య ఎంఓయూ
మనదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రప్రినూర్షిప్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రముఖ పారిశ్రామిక సంస్థ మాలక్ష్మి గ్రూప్, ఫిన్లాండ్కు చెందిన ఎఫ్ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మాలక్ష్మి గ్రూప్ తెలంగాణ, ఏపీలో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, అగ్రి, స్పోర్ట్స్, స్టార్టప్ ఎకోసిస్టమ్ వ్యాపారాల్లో ఉంది. కాగా, ప్రముఖ గేమ్ డిజైనర్ పీటర్వెస్టర్బాకా ప్రమోట్ చేసిన ఎఫ్ఇండియా ఆంగ్రీబర్డ్స్, స్లష్ వంటి జనాదరణ పొందిన గేమ్స్ను డెవలప్చేసింది. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా స్టార్టప్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడానికి మాలక్ష్మి గ్రూప్కు చెందిన సెడిబస్తోనూ ఎఫ్ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు కావాల్సిన నాణ్యమైన విద్యను ఎంట్రప్రినూర్షిప్ యూనివర్సిటీ అందిస్తుందని మాలక్ష్మి గ్రూపు ప్రకటించింది.
ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డిజైన్ థింకింగ్, గేమ్ డెవెలప్మెంట్, టీచర్స్ ట్రైనింగ్ వంటి కోర్సులు నేర్పిస్తారు. ఎదిగే సామర్థ్యం ఉన్న స్టార్టప్లను గుర్తించడం, వాటికి నిధులు అందించడానికి సహకరించడం, యూరప్లో అవకాశాలు కల్పించడం వంటి వాటికోసం సెడిబస్, ఎఫ్ఇండియా ఒప్పందం ఉపయోగపడుతుంది. హైదరాబాద్లోని ఒక హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పీటర్ వెస్టర్బాకా, సైయంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, ఏఐఎస్ నవీన్ మిట్టల్, మాలక్ష్మి గ్రూప్ వ్యవస్థాపకుడు హరీశ్ చంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.