టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలంగాణలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టాప్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఎంతో మంది పేర్లు ఈ కేసులో బయటపడ్డాయి. అప్పట్లో అందరిని ఈడీ విచారించింది. అయితే తాజాగా మరో డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు వినిపించడం కలకలం రేపింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ కేసుతో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురి పేర్లు బయటకొస్తున్నాయని ఆయన తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్ చేసినట్లు వివరించారు. వీటి ద్వారా టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటికొచ్చాయని చెప్పారు.
Also Read :- నవదీప్ అంటే వేరే నేను కాదు.. డ్రగ్స్ కేసుపై హీరో నవదీప్ క్లారిటీ
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిర్మాత సుశాంత్ రెడ్డి, హీరో నవదీప్, షాడో మూవీ నిర్మాత రవి ఉప్పలపాటి, మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ రావు పేర్లను సీవీ ఆనంద్ వెల్లడించారు. వీరిలో సుశాంత్ రెడ్డి, దేవరకొండ సురేష్ రావులను అరెస్ట్ చేశామని చెప్పారు. అయితే వీరితో పాటు.. గచ్చిబౌలిలో స్నాట్ పబ్ నిర్వహించే సూర్య, జూబ్లీహిల్స్లోని టెర్రా కెఫే అండ్ బిస్ట్రో బార్ నిర్వాహకుడు అర్జున్, కల్హర్ రెడ్డి, ఇంద్రతేజ్, శ్వేత, కార్తిక్ ఉన్నారని..వీరంతా పరారీలో ఉన్నట్లు చెప్పారు. హీరో నవదీప్, రవి ఉప్పలపాటి కూడా పరారీలో ఉన్నారని వివరించారు.