
కొందరు అద్భుతంగా నటిస్తారు. అందుకే మరణించాక కూడా జీవిస్తారు. మధుబాల కూడా అంతే. అప్పట్లో ఆమె తెరపై కనిపిస్తే థియేటర్లలో చప్పట్ల వర్షం కురిసేది. ఆమెని ఒక్కసారి చూసినా చాలంటూ అభిమానగణం ఇంటి ముందు క్యూ కట్టేది. అలాంటి అందగత్తెని మళ్లీ చూడలేదంటూ ఇప్పటికీ బాలీవుడ్ చెబుతూ ఉంటుంది. అలాంటి గ్రేట్ యాక్ట్రెస్ బయోపిక్ ఇప్పుడు తెరకెక్కబోతోంది. మధుబాల చెల్లెలు మధుర్ ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్తో కలిసి ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నట్టు ప్రకటించారు. జీవించింది కేవలం ముప్ఫయ్యారేళ్లే అయినా ఎప్పటికీ చెరిగిపోని ఇమేజ్ సంపాదించుకున్నారు మధుబాల. ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ అంటూ అనార్కలి పాత్రలో ఆమె పర్ఫార్మెన్స్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే ఒక అరుదైన గుండె జబ్బు బారిన పడటంతో కెరీర్ దెబ్బ తింది. పర్సనల్ లైఫ్లోనూ ఎంతో వేదన అనుభవించారామె. అదంతా ఈ మూవీలో చూపించనున్నారట. దిలీప్ కుమార్తో ప్రేమ, సింగర్ కిశోర్ కుమార్తో పెళ్లి లాంటివన్నీ ఉంటాయట. నిజానికి మధుబాల బయోపిక్ తీయబోతున్నానంటూ బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ ఆమధ్య చెప్పాడు. అయితే రీసెంట్ అనౌన్స్మెంట్లో అతని పేరు లేదు. పైగా ఈ సినిమా తీసే అధికారం తమ కుటుంబానికి మాత్రమే ఉందని కూడా మధుబాల ఫ్యామిలీ మెంబర్స్ తేల్చేశారు. దాంతో ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు, మధుబాల పాత్రలో ఏ హీరోయిన్ కనిపించబోతోంది అనే ఆసక్తి నెలకొంది. మధుర్ మనసులో మాత్రం కరీనా ఉందట. ఏదేమైనా నాటి తమ అభిమాన తార జీవితాన్ని ఇన్నేళ్ల తర్వాత తెరపై చూడటం అభిమానుల్ని ఎంతో సంతోషపెట్టే విషయమే.