
- పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నరు
- కవిత చెప్పిన విషయాల గురించి ఆమెనే అడగండి
- బీఆర్ఎస్కు సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వం ఉంది
- ఆయన సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీస్కుంటరని కామెంట్
హైదరాబాద్, వెలుగు: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని కొంత మంది కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని మండలి ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ సీనియర్ నేత మధుసూదనా చారి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు వ్యూహాలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. 60 లక్షల మంది సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే పార్టీలో విలీనం చేస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ పాలన చర్చకు వస్తే కాంగ్రెస్, బీజేపీ రాజకీయ పునాదులు కదులుతాయని, అందుకే దాని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పాలనద్వారా ప్రజల మెప్పు పొందాలిగానీ.. వేరే పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ చౌకబారు రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవుపలికారు. ప్రతికూల పరిస్థితుల్లో టీఆర్ఎస్ను కేసీఆర్ స్థాపించారని చెప్పారు. తెలంగాణ అంటే నక్సలైట్లు అనుకునే సందర్భంలో కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీకి దీటుగా పార్టీ ఆవిర్భావం జరిగిందని, ఇద్దరు బలమైన నాయకులు చంద్రబాబు, వైఎస్సార్ను కేసీఆర్ ఎదుర్కొన్నారని తెలిపారు.
కేసీఆర్ సీఎంగా లేరని జనం బాధపడుతున్నరు
తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్, బీజేపీ కాపాడలేవని మధుసూదనాచారి అన్నారు. కేంద్రమంత్రుల భాష, వారి పాలన ప్రజలు అసహ్యించుకునేలా ఉందని చెప్పారు. కేసీఆర్ సీఎంగా లేనందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వం పై ప్రజలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. పార్టీ వ్యవస్థాపక నేతగా కేసీఆర్ ఆలోచనలు తనకు తెలుసని చెప్పారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగనివ్వబోరన్నారు. తెలంగాణ జాతి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉంటుందని చెప్పారు.
పార్టీలో జరిగిన పరిణామాలేంటో తమకు ఎక్కువ తెలుసన్నారు. బీఆర్ఎస్కు కేసీఆర్ రూపంలో సమర్థవంతమైన నాయకుడున్నారని చెప్పారు. మిగతా పార్టీలకు నాయకత్వ బలహీనతలు ఉండొచ్చని, కానీ, తమకు మాత్రం ఆ సమస్య లేదని పేర్కొన్నారు. తమ నాయకుడు సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. జాగృతి ఆఫీసు ప్రారంభోత్సవం గురించి మీడియా ప్రశ్నించగా.. ఎవరికి సంబంధించిన విషయాలను వారినే అడిగితే బాగుంటుందని తెలిపారు. జూన్ 2న కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ భవన్లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని చెప్పారు.