బీజేపీలో బీఆర్ఎస్ ​విలీన ప్రచారం కొందరి కుట్ర: మధుసూదనాచారి

బీజేపీలో బీఆర్ఎస్ ​విలీన ప్రచారం  కొందరి కుట్ర: మధుసూదనాచారి
  • పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నరు
  • కవిత చెప్పిన విషయాల గురించి ఆమెనే అడగండి
  • బీఆర్ఎస్​కు సమర్థవంతమైన కేసీఆర్​ నాయకత్వం ఉంది
  • ఆయన సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీస్కుంటరని కామెంట్

హైదరాబాద్, వెలుగు: బీజేపీలో బీఆర్ఎస్​ విలీనమవుతుందని కొంత మంది  కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని మండలి ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్​ సీనియర్​ నేత మధుసూదనా చారి అన్నారు. బీఆర్ఎస్​ పార్టీని బలహీనపరిచేందుకు వ్యూహాలు పన్నుతున్నారని ఫైర్​ అయ్యారు.  60 లక్షల మంది సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్​ను రాజకీయంగా ఎదుర్కోలేకనే పార్టీలో విలీనం చేస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. శనివారం తెలంగాణ భవన్​లో మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్ పాలన చర్చకు వస్తే కాంగ్రెస్​, బీజేపీ రాజకీయ పునాదులు కదులుతాయని, అందుకే దాని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పాలనద్వారా ప్రజల మెప్పు పొందాలిగానీ.. వేరే పార్టీలో బీఆర్ఎస్​ విలీనం అవుతుందంటూ చౌకబారు రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవుపలికారు.  ప్రతికూల పరిస్థితుల్లో టీఆర్ఎస్​ను కేసీఆర్​ స్థాపించారని చెప్పారు. తెలంగాణ అంటే నక్సలైట్లు అనుకునే సందర్భంలో కేసీఆర్​ పార్టీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్​, టీడీపీకి దీటుగా పార్టీ ఆవిర్భావం జరిగిందని, ఇద్దరు బలమైన నాయకులు చంద్రబాబు, వైఎస్సార్​ను కేసీఆర్​ ఎదుర్కొన్నారని తెలిపారు.

కేసీఆర్​ సీఎంగా లేరని జనం బాధపడుతున్నరు

తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్​, బీజేపీ కాపాడలేవని మధుసూదనాచారి అన్నారు. కేంద్రమంత్రుల భాష, వారి పాలన  ప్రజలు అసహ్యించుకునేలా ఉందని చెప్పారు. కేసీఆర్​ సీఎంగా లేనందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్​ నాయకత్వం పై ప్రజలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. పార్టీ వ్యవస్థాపక నేతగా కేసీఆర్​ ఆలోచనలు తనకు తెలుసని చెప్పారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగనివ్వబోరన్నారు. తెలంగాణ జాతి ఉన్నంత వరకు బీఆర్ఎస్​ పార్టీ ఉనికి ఉంటుందని చెప్పారు. 

పార్టీలో జరిగిన పరిణామాలేంటో తమకు ఎక్కువ తెలుసన్నారు. బీఆర్ఎస్​కు కేసీఆర్​ రూపంలో సమర్థవంతమైన నాయకుడున్నారని చెప్పారు. మిగతా పార్టీలకు నాయకత్వ బలహీనతలు ఉండొచ్చని, కానీ, తమకు మాత్రం ఆ సమస్య లేదని పేర్కొన్నారు. తమ నాయకుడు సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.  జాగృతి ఆఫీసు ప్రారంభోత్సవం గురించి మీడియా ప్రశ్నించగా.. ఎవరికి సంబంధించిన విషయాలను వారినే అడిగితే బాగుంటుందని తెలిపారు. జూన్​ 2న కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ భవన్​లో హరీశ్​ రావు పవర్​ పాయింట్​ ప్రెజెంటేషన్​ ఇస్తారని చెప్పారు.