మధ్యప్రదేశ్ లో ఓ బాలుడిని పోలీసులు చెప్పులు,కర్రలతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది ప్రభుత్వం.
దామో జిల్లాలోని కోత్వాలి పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. వీడియోలో ఇద్దరు పోలీసులు ఓ అమాయకపు బాలుడిని చెప్పులు, కర్రలతో చితకబాదుతున్నారు. ఎందుకు కొడుతున్నారో అనేది తెలియదు. కానీ కొట్టొద్దని ఎంత వేడుకున్నా వినకుండా పోలీసులు ఆ బాలుడిని నవ్వుతూ కొడుతూనే ఉన్నారు. ఆ బాలుడు ఏడుస్తూ చివరకు పోలీసుల కాళ్ల మీద పడ్డాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.
బాలుడిని కొడుతున్న పోలీసులను గుర్తించారని, వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ తెలిపారు. వీడియోలో ఉన్నది మహేష్ యాదవ్ ,మనీష్ గాంధర్వ్ అనే కానిస్టేబుళ్లుగా గుర్తించారు. ఈ విషయంపై తాము దర్యాప్తు చేస్తామన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా స్పందించారు. బాలుడిని కొడుతున్న ఘటనపై త్వరగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించామని ట్వీట్ చేశారు.ఇటువంటి అమానవీయ సంఘటనలు మానవత్వంపై మచ్చలాంటిదన్నారు. సహించలేమని, దోషులెవరైనా తప్పించుకోకూడదని అన్నారు. దర్యాప్తు తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.