హైదరాబాద్పై మాగంటి ముద్ర.. హుడా డైరెక్టర్, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా సేవలు

హైదరాబాద్పై మాగంటి ముద్ర.. హుడా డైరెక్టర్, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా సేవలు
  • జూబ్లీహిల్స్​పై పట్టు నిలుపుకున్న గోపీనాథ్​
  •  మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
  •  2014లో టీడీపీ నుంచి, 2018, 2023లో బీఆర్ఎస్​ తరఫున విజయం


హైదరాబాద్​సిటీ, వెలుగు: రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన జూబ్లీహిల్స్​ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​నగరంపై తనదైన ముద్ర వేశారు. 1982లో మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీలో చేరి, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ కు అత్యంత విధేయుడిగా పేరు పొందారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోనూ సన్నిహితంగా ఉన్నారు. పదేండ్లుగా బీఆర్ఎస్ లో కొనసాగుతూ మాజీ సీఎం కేసీఆర్​కు సన్నిహితుడిగా మెలిగారు. ఏ రాజకీయ నాయకుడైనా తాను ఉన్న పార్టీకి విధేయుడిగా ఉండాలని కోరుకునే గోపీనాథ్​కడవరకూ అదే విధానాన్ని పాటిస్తూ వచ్చారు.

పుట్టి, పెరిగింది ఇక్కడే..

గోపీనాథ్​తల్లిదండ్రులు ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్​లో​స్థిరపడ్డారు. ఆయన 1963 జూన్ 2న హైదర్​గూడలో జన్మించారు. సిటీలోనే చదువు కొనసాగించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్(బీఏ) పూర్తి చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్​స్థాపించిన టీడీపీ స్టేట్ ఆఫీస్ హిమాయత్​నగర్​లో ఉండడంతో గోపీనాథ్ తరచూ పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. అందువల్లే ఎన్టీఆర్ తో ఆయనకు సాన్నిహత్యం పెరిగిందని అంటుంటారు. 

ఎన్టీఆర్​వీరాభిమాని అయిన మాగంటి పలుమార్లు అప్పటి హిమాయత్ నగర్​నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రయత్నించినా టికెట్​దక్కలేదు. కానీ, పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ(హుడా) డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 

హాట్రిక్​ సాధించిన ఎమ్మెల్యే..

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్​టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి, అప్పటి కాంగ్రెస్​అభ్యర్థి విష్టువర్ధన్​రెడ్డిపై విజయం సాధించి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కొంతకాలం టీడీపీలో కొనసాగిన ఆయన మాజీ సీఎం కేసీఆర్​పిలుపుతో బీఆర్ఎస్​లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి రెండోసారి విజయం సాధించారు. 

అసెంబ్లీ పబ్లిక్​ఎస్టిమేషన్​కమిటీ(పీఈసీ) సభ్యుడిగా పని చేశారు. 2023లో కాంగ్రెస్​అభ్యర్థి అజారుద్దీన్​పై గెలిచి, హ్యాట్రిక్​విజయాన్ని అందుకున్నారు. మాగంటి సేవలను గుర్తించిన కేసీఆర్​ఆయనకు గ్రేటర్​హైదరాబాద్ బీఆర్ఎస్​ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు. కానీ, అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీని ముందుకు నడిపించలేక పోయారు. 

జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై పట్టు నిలుపుకున్న గోపీనాథ్​మృతితో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర  విషాదంలో మునిగిపోయారు. ఆయన​ముక్కుసూటితనం వల్ల రాజకీయంగా చాలామంది శత్రువులు తయారయ్యారని, వారితో తరచూ జరుగుతున్న గొడవలతోనే మానసికంగా కుంగిపోయారని సన్నిహితులు చెబుతుంటారు.

సినీ నిర్మాతగా గోపీనాథ్​

మాగంటి గోపీనాథ్ నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. సినీ ఇండస్ట్రీతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. గోపీనాథ్​వాడిన బుల్లి కారు ఒకటి చాలా సినిమాలకు అట్రాక్షన్​గా వాడుకునేవారు. ఆయన 1985లో పాతబస్తీ, 2000లో రవన్న, 2003లో తారకరత్న హీరోగా భద్రాద్రి రాముడు, 2009లో డాక్టర్​రాజశేఖర్​హీరోగా నా స్టైలే వేరు సినిమాలు నిర్మించారు. అనంతరం రాజకీయాలపై ఎక్కువ ఫోకస్​ పెట్టడంతో సినిమాలను తగ్గించారు.