- జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ క్యాండిడేట్మాగంటి సునీత ఆరోపణ
- నైతిక విజయం తనదేనని కామెంట్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ రౌడీయిజం, గూండాయిజంతో రిగ్గింగులు చేసి గెలిచిందని బీఆర్ఎస్ క్యాండిడేట్మాగంటి సునీత ఆరోపించారు.‘‘ఇదీ ఒక గెలుపేనా?’’ అని ప్రశ్నించారు. నైతిక విజయం తనదేనని వ్యాఖ్యానించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం కౌంటింగ్కేంద్రంబయట మీడియాతో సునీత మాట్లాడారు. అప్పుడు రిగ్గింగులు చేసిన వాళ్లే.. ఇప్పుడు కౌంటింగ్ హాల్లోనే ర్యాగింగ్లు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మహిళలపై అసభ్యంగా మాట్లాడుతున్నారు.
గోపీనాథ్ ఉన్నంత కాలం ఎక్కడో దాక్కున్న రౌడీలు.. ఆయన చనిపోయాక కలుగుల్లో నుంచి బయటకు వస్తున్నారు” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గెలిచిందని అన్నారు. ‘‘రిగ్గింగ్ చేసి గెలవడం ఓ గెలుపే కాదు.. నైతిక విజయం నాదే. ఆడబిడ్డపైన ఎంత దౌర్జన్యం చేయాలో అంతచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అప్రజాస్వామికంగా జరిగింది. రౌడీలతో భయపెట్టి ఓట్లు వేయించుకొనే రౌడీ రాజ్యం మొదలైంది” అని విమర్శించారు.
నాలుగైదు పార్టీలు కలిసి గెలిచినయ్
ఈ ఎన్నికలో నాలుగు, ఐదు పార్టీలతో కలిసి గెలిచారని, ఇది గెలుపు కాదని మాగంటి సునీత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతి చోట రిగ్గింగ్ చేశారు కాబట్టి అన్ని రౌండ్స్లోనూ ఆ పార్టీ లీడ్ కనబరిచిందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం చెయ్యకపోవడం వల్లే ఓడిపోయామని తాము అనుకోవడం లేదన్నారు. 3 నెలల నుంచి ఏం జరుగుతుందో అందరూ చూశారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో చివరికి రౌడీయిజమే గెలిచిందని వ్యాఖ్యానించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను బెదిరించినా.. గెలిచిన అభ్యర్థికి మామూలు మెజారిటీనే వచ్చిందని పేర్కొన్నారు.
