గంజాయి స్మగ్లర్లకు 20 ఏండ్లు జైలు

గంజాయి స్మగ్లర్లకు 20 ఏండ్లు జైలు

గూడూరు,వెలుగు: గంజాయి స్మగ్లింగ్​ చేస్తూ పట్టుబడ్డ స్మగ్లర్లకు  మహబూబాబాద్​ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మహబూబాబాద్​ జిల్లా గూడూరు సీఐ బాబురావు బుధవారం వివరాలు తెలియజేశారు. వరంగల్​ జిల్లా ఖానాపూర్​ మండలం బుధరావుపేటకు చెందిన ఎస్​కె ఇస్మాయిల్, గూడూరు మండలం కోబల్​తండాకు చెందిన ధరంసోతు శ్రీను, బ్రాహ్మణపల్లి శివారు ఆముతండాకు చెందిన ధరంసోతు కిరణ్ కుమార్, వరంగల్​ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండకు చెందిన పల్లకొండ సాంబమూర్తి 2021లో గూడూరు పరిధిలో గంజాయి స్మగ్లింగ్​ చేస్తూ పట్టుబడ్డారు. 

అప్పటి సీఐ రాజిరెడ్డి అరెస్ట్​ చేసి కోర్టులో ఛార్జ్​షీట్​ దాఖలు చేశారు. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు పరిశీలించిన మహబూబాబాద్​ కోర్టు  నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ బుధవారం 20 ఏండ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. కేసు విచారణలో సహకరించిన కోర్టు కానిస్టేబుల్స్​నరేశ్, రమేశ్​లను సీఐ అభినందించారు.