జలపాతంలో పడి యువకుడు మృతి.. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఘటన

జలపాతంలో పడి యువకుడు మృతి.. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఘటన

వెంకటాపురం, వెలుగు : జలపాతంలో పడి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం అరుణాచలపురం గ్రామ సమీపంలోని గుండం జలపాతం వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ కు చెందిన అక్బర్, ఇలియాస్, అన్వర్, సయ్యద్ అక్తరుద్దీన్ (26) ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ములుగు జిల్లాలోని జలపాతాలను చూడడానికి రెండు బైక్ లపై ఆదివారం ఉదయం వాజేడు మండలానికి చేరుకున్నారు.

 బొగత జలపాతం ఓపెన్ చేయకపోవడంతో అక్కడి నుంచి దూలపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అరుణాచలపురం గ్రామ సమీపంలో ఉన్న గుండం జలపాతం వద్దకు వచ్చారు. అక్కడ ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేసిన అనంతరం నీటిలోకి దిగారు. ఈ క్రమంలో అక్తరుద్దీన్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. 

గమనించిన మిగతా వారు 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని అక్తరుద్దీన్ ను బయటకు తీసి సీపీఆర్ చేశారు. అనంతరం టూ వీలర్ పై మెయిన్ రోడ్డు పైకి తీసుకొచ్చి అక్కడి నుంచి 108లో ఏటూరు  నాగారం హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వాజేడు ఎస్సై సతీశ్ తెలిపారు. కాగా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్దకే పర్యాటకుల అనుమతి ఉందని ఎఫ్ ఆర్ వో నరేందర్ చెప్పారు. అనుమతి లేని జలపాతాల వద్దకు వెళ్లే పర్యాటకులపై కేసులు పెడుతామని హెచ్చరించారు.