ములుగు/ గ్రేటర్ వరంగల్/ ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం ములుగు, వరంగల్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం– ఉత్సవాలు 2026 కార్యక్రమాలను నిర్వహించారు. ములుగులో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ దివాకర పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1.90 కోట్ల ప్రయాణాల ద్వారా మహిళలు రూ.133.25 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ త్వరలో సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వరంగల్ బస్టాండ్ వద్ద నిర్వహించిన సంబురాల్లో కలెక్టర్ సత్యశారదాదేవి, బల్దియా మేయర్ గుండు సుధారాణి పాల్గొని మాట్లాడారు.
జిల్లాలో నమోదైన ఉచిత ప్రయాణాల ద్వారా మహిళలు రూ.270 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. టెక్స్టైల్ పార్క్, కేటెక్స్, యంగ్ వన్ వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయని, మహిళలకు అవసరమైన శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం నూతన బస్టాండ్లో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సరిరాం అధ్యక్షతన నిర్వహించిన సెలబ్రేషన్స్లో కేఎంసీ సిటీ మేయర్ పూనుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా హాజరై మాట్లాడారు. అనంతరం పలువురి మహిళా ప్రయాణికులను సన్మానించి, బహుమతులు అందజేశారు.
