నోట్లపై శివాజీ, అంబేద్కర్,సావర్కర్, మోడీ​ ఫొటోలు పెట్టాలి

నోట్లపై శివాజీ, అంబేద్కర్,సావర్కర్, మోడీ​ ఫొటోలు పెట్టాలి

ముంబై: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి ఫొటోలు ఉండాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచనతో ఈ తరహా డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా కరెన్సీపై ఛత్రపతి శివాజీ, బీఆర్ అంబేద్కర్, వీర సావర్కర్ తోపాటు ప్రధాని మోడీ ఫొటోలను పెట్టాలంటూ మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత రామ్ కదమ్ డిమాండ్ చేశారు. ఫొటోషాప్​ చేసిన ఈ బొమ్మలతో ఉన్న రూ.500 నోట్లను ఆయన ట్వీట్ చేశారు. కేజ్రీవాల్​ వంచన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన డిమాండ్​ సరైనదైతే దేశం అంగీకరించేదని, కానీ ఎన్నికలప్పుడే వీరికి మన దేవుళ్లు, దేవతలు గుర్తుకొస్తారని మండిపడ్డారు.

శివాజీ, అంబేద్కర్, సావర్కర్ ఇమేజీలను ఎవరూ వ్యతిరేకించరని, వీరు అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఇక ఇండియాను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన మోడీని ఎలా మర్చిపోతామని, ఆయన త్యాగం, కృషి వల్లే మనం ఈ స్థాయిలో ఉండేలా చేశాయన్నారు. ఇక కాంగ్రెస్​ నేత మనీశ్ తివారీ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ఉండాలని సూచించారు. ఒకవైపు మహాత్మాగాంధీని, మరోవైపు అంబేద్కర్​ బొమ్మను ముద్రించాలని, ఒకవైపు అహింస, మరోవైపు రాజ్యాంగవాదం గురించి తెలియజెప్పినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇది మోడ్రన్​ ఇండియాకు సరిగ్గా సరిపోతుందని చెప్పారు.