దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3 లక్షల 8వేల మందికి పైగా కరోనా బారినపడగా.. ఒక్క మహారాష్ట్రలోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా టెస్టులు చేసి, వైరస్ సోకిన వారిని ముందే గుర్తించి చికిత్స అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని ప్రభుత్వాలకు భారత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) సూచిస్తోంది. దీంతో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు ప్రైవేటు ల్యాబ్స్లోనూ టెస్టు చేసేందుకు అనుమతి ఇచ్చాయి. అయితే ప్రైవేటు ల్యాబ్స్ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నిర్ధారణకు ప్రామాణికమైన టెస్టు ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు ప్రస్తుతం ల్యాబ్స్ రూ.4,400 వసూలు చేస్తున్నాయి. ఇకపై రూ.2,200కు మించి చార్జ్ చేయకూడదని ఆదేశించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇంటి నుంచి శాంపిల్స్ సేకరించి, టెస్టులు చేస్తే.. వారి నుంచి రూ.2800 వరకు చార్జ్ చేయొచ్చని తెలిపింది. ప్రభుత్వం సూచించిన గరిష్ఠ ధరలకు మించి ఎక్కువగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఆయా ప్రైవేటు ల్యాబ్స్, ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే చెప్పారు.
Maharashtra Government caps maximum price for #COVID19 tests (RT-PCR) at Rs 2200, the earlier price was 4400. Maximum price for the test by collecting samples from home capped at Rs 2800. pic.twitter.com/l1TsEIs6ij
— ANI (@ANI) June 13, 2020