
ఏ సంస్థలోనైనా కేంద్ర లేదా రాష్ట్ర లేదా ప్రాంతీయ ప్రభుత్వాలకు 51శాతం, అంతకంటే ఎక్కువ శాతం వాటాను కలిగి ఉంటే దాన్ని ప్రభుత్వరంగ సంస్థగా పరిగణించవచ్చు.
ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడేవి: వీటికి పెట్టుబడి పూర్తిగా ప్రభుత్వమే సమకూరస్తుంది. ఇవి పార్లమెంట్కు బాధ్యత వహిస్తాయి. ఉదా: రైల్వేలు, పోస్టల్, టెలిగ్రామ్, ఆల్ ఇండియా రేడియో.
పబ్లిక్ కార్పొరేషన్స్: ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా వీటిని స్థాపిస్తుంది. పూర్తి వాటా ప్రభుత్వానిదే. ఉదా: ఎల్ఐసీ, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, ఆర్బీఐ.
ప్రభుత్వ కంపెనీలు: 1956, కంపెనీ చట్టం ద్వారా ఇవి ఏర్పాటై ఉంటాయి. దీనికి ప్రభుత్వం ఏకైక వాటాదారుగా గానీ అత్యధిక వాటాదారుగా గానీ ఉంటుంది.
ఉదా: హెచ్ఎంటీ, బీహెచ్ఈఎల్, బీఈఎల్.
ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అని విడదీస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు అంటారు. ఇవి భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతాయి. ఇవి వాణిజ్య సామర్థ్యం, సామాజిక బాధ్యత అనే లక్ష్యాలతో నిర్వహించబడుతున్నాయి. 1951లో ప్రభుత్వరంగ సంస్థలు ఐదు ఉండేవి. వీటిలో పెట్టుబడి రూ.29కోట్లు. 2020 మార్చి నాటికి 366కు చేరాయి. వీటిలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి. లభించిన ఆర్థిక స్వయం ప్రతిపత్తినిబట్టి సీపీఎస్ఈలను మినీ రత్న, నవరత్న, మహారత్న అని మూడు రకాలుగా విడదీస్తారు.
నవరత్న: నవరత్న అంటే ఆభరణం అని అర్థం. దీన్ని 1997లో ప్రవేశపెట్టారు. నవరత్న హోదా పొందేందుకు కింది అర్హతలు కలిగి ఉండాలి. వరుసగా మూడు సంవత్సరాల నుంచి లాభాలనార్జిస్తూ సగటున 1000 కోట్లు లాభం రావాలి. రుణాల వడ్డీ చెల్లింపుల్లో వైఫల్యం చెందొద్దు. నిర్వహణా ఖర్చుల కోసం బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడరాదు. ప్రభుత్వం సూచించిన ఆరు సూచీల్లో గల 100 మార్కులకు 60 మార్కులు రావాలి. నవరత్న హోదా పొందేందుకు అది మినీరత్న హోదా పొంది ఉండాలి.
నవరత్న కంపెనీలు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, హిందూస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
మినీరత్న: 1997లో మినీరత్న హోదాను సృష్టించారు. వరుసగా మూడేండ్లు లాభాలు పొందుతూ లాభం రూ.30కోట్లు దాటితే మినీరత్న–1, రూ.30కోట్ల కంటే తక్కువ ఉంటే మినీరత్న–2 హోదానిస్తారు. ఇవి కూడా రుణాల చెల్లింపుల్లో వైఫల్యం చెందొద్దు. నిర్వహణ ఖర్చుల కోసం బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడరాదు. నికర ఆస్తులు ధనాత్మకంగా ఉండాలి. ఈ హోదాను పొందితే మినీరత్న–1 రూ.500కోట్ల వరకు లేదా దాని ఆస్తుల విలువకు సమానంగా పెట్టుబడి నిర్ణయాల్లో స్వేచ్ఛ కలిగి ఉంటాయి. మినీరత్న–2 రూ.300కోట్లు లేదా నికర విలువలో 50శాతం వరకు పెట్టుబడి స్వేచ్ఛ కలిగి ఉంటాయి. ఇవి కూడా మూలధన వ్యయం, జయింట్ వెంచర్లోకి ప్రవేశించడం, విదేశాల్లో ఆఫీసులు కలిగి ఉండటం, అనుబంధ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడం, సాంకేతిక వ్యూహాత్మక ఒప్పందాలు, మానవ వనరుల అభివృద్ధిలో స్వేచ్ఛను కలిగి ఉంటాయి. 2022 ఫిబ్రవరి నాటికి మినీరత్న హోదా–1(62), మినీరత్న హోదా–2(12) కలిపి మొత్తం 74 ఉన్నాయి.
మహారత్న: దీనిని 2009లో ప్రవేశపెట్టారు. ప్రధాన ఉద్దేశం ప్రభుత్వరంగ సంస్థలు తమ కార్యకలాపాల విస్తరణతో అంతర్జాతీయ సంస్థలుగా ఎదిగేందుకు దోహదపడుతాయి. దీనిని పొందడానికి నవరత్న హోదా పొంది ఉండాలి. మూడేండ్లుగా లాభం పొందుతూ ఒక సంవత్సర నికర లాభం రూ.5000కోట్లు ఉండాలి. గత మూడు సంవత్సరాల్లో సగటు నికర లాభాన్ని తీసుకుంటారు. నికర ఆస్తులు రూ.15,000కోట్లు ఉండాలి. వార్షిక టర్నోవర్ రూ.25,00కోట్లు ఉండాలి. స్టాక్ మార్కెట్లో నమోదై షేర్లు ట్రేడింగ్ అవుతూ ఉండాలి. భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మంత్రి ఈ హోదా ఇవ్వడంలో నిర్ణయం తీసుకుంటారు. పెట్టుబడి నిర్ణయంలో నెట్వర్త్లో 15శాతం, గరిష్ఠంగా రూ.5000కోట్ల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. స్వేచ్ఛనిచ్చేందుకు, అంతర్జాతీయ సంస్థలుగా ఎదిగేందుకు, అధిక లాభాలతో నడుస్తున్న సంస్థలకు ఈ హోదానిస్తారు.
2022, జులై నాటికి 12 మహారత్న సంస్థలు ఉన్నాయి. అవి.. ఆయిల్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎస్ఏఐఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్.
లాభాలు, నష్టాలు పొందే పీఎస్యూలు
భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల విభాగాలు ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ 61వ నివేదికను ప్రకటించింది. దీని ప్రకారం 2021లో గల సీపీఎస్ఈలు 389. కాగా వీటిలో నిర్వహించబడేవి 255, నిర్వహణలో ఉన్నవి 108. 26 సీపీఎస్ఈలు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 61 సీపీఎస్ఈలు లిస్టెడ్ అయ్యాయి. వీటిలో 2021 మార్చి నాటికి వ్యవసాయ రంగంలో 3, మైనింగ్లో 25, మాన్యుఫ్యాక్చరింగ్లో 110, సేవల్లో 143, నిర్మాణంలో 108 మొత్తం 389 ఉన్నాయి.