V6 News

మహేష్ బాబు కోసం ఎగ్జామ్స్‌ను మధ్యలోనే వదిలేసిన విద్యార్థులు.. సూపర్ స్టార్ క్రేజ్‌పై సత్యదేవ్ షాకింగ్ కామెంట్స్!

మహేష్ బాబు కోసం ఎగ్జామ్స్‌ను మధ్యలోనే వదిలేసిన విద్యార్థులు.. సూపర్ స్టార్ క్రేజ్‌పై సత్యదేవ్ షాకింగ్ కామెంట్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 50 ఏళ్లు వయసులోనే నవ యువకుడిలా కనిపిస్తూ తన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. లేటెస్ట్ గా మహేష్ బాబు సమర్పిస్తున్న 'రావు బహదూర్' చిత్ర ప్రమోషన్స్ సందర్భంగా నటుడు సత్యదేవ్ పంచుకున్న ఒక ఆసక్తికరమైన పాత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పరీక్షలు వదిలేసిన విద్యార్థులు..

నటుడు సత్యదేవ్ తన కేరీర్ ప్రారంభంలో మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక వింత సంఘటనను సత్యదేవ్ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎస్.ఆర్. నగర్ ఏరియాలో ఒక బిల్డింగ్ పైన మహేష్ బాబుతో కలిసి ఒక సీన్ షూట్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే మహేష్ బాబు వచ్చారని తెలియగానే, విద్యార్థులు పరీక్షలు వదిలేసి కిటికీల దగ్గరకు చేరుకున్నారు. రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. చివరికి పోలీసులు వచ్చి షూటింగ్ ఆపేయమని కోరారు. మహేష్ బాబును చూడటం కోసం విద్యార్థులు పరీక్షలు రాయడం మానేశారంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో నాకు అప్పుడు అర్థమైంది అని సత్యదేవ్ చెప్పుకొచ్చారు.

కష్టపడి షూట్ చేసిన ఆ సీన్ కట్..

విచిత్రమేమిటంటే.. అంత కష్టపడి షూట్ చేసిన ఆ సీన్ సినిమాలో లేదు. మహేష్ తన భుజంపై చేయి వేసి మాట్లాడిన విషయాన్ని సత్యదేవ్ తన స్నేహితులకు చెబితే ఎవరూ నమ్మలేదట. కానీ, తర్వాత ఆ డిలీటెడ్ సీన్ యూట్యూబ్‌లో విడుదల కావడంతో సత్యదేవ్ ఊపిరి పీల్చుకున్నారు. నాడు మహేష్ పక్కన చిన్న పాత్రలో నటించిన సత్యదేవ్, ఇప్పుడు ఆయన నిర్మాణంలోనే (GMB ఎంటర్‌టైన్మెంట్) 'రావు బహదూర్' చిత్రంలో హీరోగా నటించడం ఒక 'ఫుల్ సర్కిల్' మూమెంట్ అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

►ALSO READ | రజనీకాంత్ 'జైలర్ 2' మూవీ లీక్.. సోషల్ మీడియాలో క్లిప్స్ వైరల్.. రంగంలోకి సన్ పిక్చర్స్!

వారణాసితో మహేష్  బిజీ.. 

ప్రస్తుతం మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'వారణాసి' మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో మహేష్ బాబు కనించనున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా (మందాకిని), పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభ) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ భారీ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది.