
హైదరాబాద్, వెలుగు : ప్రపంచంలోనే అవినీతి సామ్రాట్ సీఎం కేసీఆర్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ఆరోపించారు. అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న వ్యక్తి అని ఫైర్ అయ్యారు. 2004కు ముందు కేసీఆర్, కవిత, హరీశ్రావు ఆస్తులు ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీకి ధైర్యం ఉంటే తెలంగాణలో బినామీ చట్టాన్ని అమలు చేయాలని మహేశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.
కేబినెట్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేదని కేసీఆర్ను అడిగే ధైర్యం కవితకు లేదన్నారు. ఆమె చెప్పిన మాటలను నమ్ముకుంటూ పోతే.. చంద్రయాన్ రాకెట్ను తయారు చేసింది కూడా తానేనని చెప్తారని ఎద్దేవా చేశారు. మహిళా బిల్లు కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని చెప్పారు. స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదని, అలాంటి వాళ్లు ఇప్పుడు తెలంగాణ విలీనం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
చరిత్రను వక్రీకరించేలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారని విమర్శించారు. గుండు సూది తయారుకాని దశ నుంచి రాకెట్ పంపించే స్థాయిదాకా దేశం ఎదగడం వెనుక నెహ్రూ, గాంధీ కుటుంబం త్యాగం ఉందన్నారు. 1981లో పుట్టిన బీజేపీకి అసలు మాట్లాడే అర్హతే లేదన్నారు. విజయభేరి సభ చూసి బీఆర్ఎస్, బీజేపీకి భయం పట్టుకుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రులకు స్వేచ్ఛ లేదన్నారు. రజాకార్ ఫైల్స్ సినిమాతో ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్, వీహెచ్పీలు లేవని చెప్పారు.