ప్రపంచ అవినీతి సామ్రాట్​ కేసీఆర్: మహేశ్​ కుమార్

ప్రపంచ అవినీతి సామ్రాట్​ కేసీఆర్: మహేశ్​ కుమార్

హైదరాబాద్, వెలుగు :  ప్రపంచంలోనే అవినీతి సామ్రాట్​ సీఎం కేసీఆర్​ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్​ఆరోపించారు. అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న వ్యక్తి అని ఫైర్ అయ్యారు. 2004కు ముందు కేసీఆర్​, కవిత, హరీశ్​రావు ఆస్తులు ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీకి ధైర్యం ఉంటే తెలంగాణలో బినామీ చట్టాన్ని అమలు చేయాలని మహేశ్ కుమార్ డిమాండ్​ చేశారు. ఆయన మంగళవారం గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. 

కేబినెట్​లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేదని కేసీఆర్​ను అడిగే ధైర్యం కవితకు లేదన్నారు. ఆమె చెప్పిన మాటలను నమ్ముకుంటూ పోతే.. చంద్రయాన్​ రాకెట్​ను తయారు చేసింది కూడా తానేనని చెప్తారని ఎద్దేవా చేశారు. మహిళా బిల్లు కాంగ్రెస్​ పార్టీ మానస పుత్రిక అని చెప్పారు. స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదని, అలాంటి వాళ్లు ఇప్పుడు తెలంగాణ విలీనం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

చరిత్రను వక్రీకరించేలా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా మాట్లాడుతున్నారని విమర్శించారు. గుండు సూది తయారుకాని దశ నుంచి రాకెట్​ పంపించే స్థాయిదాకా దేశం ఎదగడం వెనుక నెహ్రూ, గాంధీ కుటుంబం త్యాగం ఉందన్నారు. 1981లో పుట్టిన బీజేపీకి అసలు మాట్లాడే అర్హతే లేదన్నారు. విజయభేరి సభ చూసి బీఆర్​ఎస్​, బీజేపీకి భయం పట్టుకుందన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ప్రభుత్వాల్లో మంత్రులకు స్వేచ్ఛ లేదన్నారు. రజాకార్​ ఫైల్స్​ సినిమాతో ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో ఆర్​ఎస్​ఎస్​, వీహెచ్​పీలు లేవని చెప్పారు.