
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో సర్ప్రైజ్ చేసే మలయాళ స్టార్ మమ్ముట్టి.. తాజాగా ఓ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ‘భ్రమయుగం’ టైటిల్తో తెరకెక్కిన ఈ మూవీని బ్లాక్ అండ్ వైట్లో తెరకెక్కించడం విశేషం. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. ఇటీవల అబు దాబిలో జరిగిన వేడుకలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ట్రైలర్ను విడుదల చేశారు.
మాయ యుగంలోని ఒక గాయకుడి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనలే ఈ సినిమా కథ. పాచికల ఆట నేపథ్యంలో, తర్వాతి సీన్ ఎలా ఉండబోతోందో అనే ఉత్కంఠను రేకెత్తించేలా ఈ ట్రైలర్ను కట్ చేశారు. ‘కాలం భారంగా గడుస్తున్న వాడికి పాచికలాటాడటం అనేది పరమౌషదం. ఇది భ్రమయుగం.. కలియుగానికి వికృత రూపం’ లాంటి డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఫిబ్రవరి 15న మలయాళ భాషలో విడుదల చేసి, త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని మేకర్స్ తెలియజేశారు.