
- కలిసి వచ్చిన ముదిరాజ్ సామాజిక వర్గం
- 30 ఏండ్ల తర్వాత మక్తల్ ప్రాంతానికి మంత్రి పదవి
మహబూబ్నగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న బీసీ కేటగిరిలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించింది. రాష్ట్రంలో ఈ సామాజిక వర్గానికి చెందిన ఓట్లర్లు ఎక్కువ మంది ఉండడంతో ఈ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ముందు నుంచి భావిస్తున్నారు. ముదిరాజ్వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా నారాయణపేట జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరి ఒక్కరే ఉండటంతో.. ఆయనకు మంత్రిగా చాన్స్ లభించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం శ్రీహరితో రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ మంత్రిగా ప్రమాణం చేయించారు.
30 ఏండ్ల తర్వాత..
మక్తల్ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరికి మాత్రమే మంత్రులుగా అవకాశం దక్కగా.. 30 ఏండ్ల తర్వాత శ్రీహరికి మంత్రిగా చాన్స్ వచ్చింది. మొదటి సారి 1958లో కల్యాణి రాంచందర్ రావు మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆయనను మంత్రి పదవి వరించింది. ఈయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఎలక్షన్స్లో మక్తల్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎల్కోటి ఎల్లారెడ్డి గెలుపొందారు. ఆయనకు చంద్రబాబు కేబినెట్లో చోటు కల్పించారు. ఎల్లారెడ్డి మార్కెటింగ్ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీహరికి అవకాశం దక్కింది. ఈయన కూడా మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం విశేషం.
ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి రెండో మంత్రి..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలు ఉండగా.. ఇప్పటి వరకు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రిగా అవకాశం లభించింది. అందులో ఒకరు పొడపాటి చంద్రశేఖర్ కాగా.. ఇప్పుడు శ్రీహరి. ఉమ్మడి ఏపీలో 1983లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. మహబూబ్నగర్ నుంచి ఈ సామాజిక వర్గానికి చెందిన పొడపాటి చంద్రశేఖర్ టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.
ఈయన 1984లో టీడీపీ ప్రభుత్వ హయాంలో న్యాయ శాఖ మంత్రిగా, 1988లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1994లో రవాణా శాఖ మంత్రిగా, 1998లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, 1999–-2004 వరకు న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఈయన ఐదు సార్లు మంత్రిగా పని చేయగా.. అన్ని సార్లు టీడీపీ ప్రభుత్వంలోనే అవకాశం దక్కింది. ఆ తర్వాత 21 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో అత్యధిక జనాభా, 54 శాతం ఓటర్లు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చింది.
ఇప్పటి వరకు మంత్రులుగా చేసింది వీరే..
టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సముచిత స్థానం కల్పించారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ హయాంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ఎక్కువగా మంత్రులుగా అవకాశం దక్కింది. ఉమ్మడి జిల్లాలో నర్సప్ప(జడ్చర్ల), డీకే సమరసింహారెడ్డి(గద్వాల), పుట్టపాగ మహేంద్రనాథ్(అచ్చంపేట), పొడపాటి చంద్రశేఖర్(మహబూబ్నగర్), నాగం జనార్దన్ రెడ్డి (నాగర్కర్నూల్), ఎల్కోటి ఎల్లారెడ్డి(మక్తల్), పులివీరన్న(మహబూబ్నగర్), పి.రాములు(అచ్చంపేట), జిల్లెల చిన్నారెడ్డి(వనపర్తి), జూపల్లి కృష్ణరావు(కొల్లాపూర్), డీకే అరుణ (గద్వాల), శంకర్రావు(షాద్నగర్), సి.లక్ష్మారెడ్డి(జడ్చర్ల), నిరంజన్ రెడ్డి (వనపర్తి), వి.శ్రీనివాస్ గౌడ్(మహబూబ్నగర్) ఉన్నారు. వీరిలో జూపల్లి కృష్ణారావు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా.. ప్రస్తుతం పర్యాటక, ఎక్సైజ్ శాఖ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. తాజాగా శ్రీహరికి కూడా మంత్రి పదవి రావడంతో, ఉమ్మడి జిల్లా నుంచి సీఎంతో పాటు మరో ఇద్దరికి మంత్రులుగా ప్రాతినిధ్యం దక్కింది.
ఊరూరా సంబురాలు..
శ్రీహరికి మంత్రి పదవి రావడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్లతో పాటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాల్చి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. శ్రీహరి మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గ లీడర్లతో మంత్రిని కలిశారు.
శ్రీహరి దంపతులను గజమాలతో సత్కరించారు. శ్రీహరికి అత్యంత సన్నిహితుడు, మిత్రుడు అయిన మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మధ్యాహ్నం శ్రీహరి ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా స్వీట్లు తినిపించి ఆలింగనం చేసుకున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాజ్భవన్ వద్ద మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.