
గండిపేట, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను విడదీసేందుకు పూనుకున్నాయని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ చైర్మన్ మన్నె శ్రీధర్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణతో చిచ్చు పెట్టి, మాలలకు అన్యాయం జరిగేలా చేస్తున్నాయన్నారు. డిసెంబర్ 1న సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో తలపెట్టిన ‘మాలల సింహగర్జన’ బహిరంగ సభను సక్సెస్చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం రాజేంద్రనగర్ లైబ్రరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని మాల సంఘాలన్నీ కలిసి సింహగర్జన సభను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. రాజేంద్రనగర్ నుంచి ప్రతిఒక్కరూ తరలిరావాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్ పచ్చ శ్రీనివాసులు, మాల సంఘాల నేతలు పాల్గొన్నారు.