- నవవధువును బలవంతంగా తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
- రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్లో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకున్న కొత్త జంటపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసి.. నవవధువును బలవంతంగా తీసుకెళ్లిన ఘటన ఆదివారం మంచాల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్కు చెందిన ఎర్పుల ప్రవీణ్కుమార్, సైదాబాద్లోని మదన్నపేటకు చెందిన ఆరుట్ల కళ్యాణి పదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. కళ్యాణి కుటుంబీకులు వేరే పెండ్లి సంబంధాలు చూస్తున్నారని, ఈ నెల 2న యాదగిరిగుట్టలో పెండ్లి చేసుకున్నారు. పెండ్లి తర్వాత తమకు ప్రాణహాని ఉందంటూ మంచాల పోలీసులను ఆశ్రయించగా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ చెబుతున్నాడు.
ఆ తర్వాత ప్రవీణ్ సొంతూరు చిత్తాపూర్లోని ఉంటున్నారు. విషయం తెలుసుకున్న కళ్యాణి కుటుంబీకులు ఓసారి ఇంటికి వచ్చి బెదిరించారు. మళ్లీ శనివారం రాత్రి ప్రవీణ్ ఇంట్లో లేని టైమ్లో సుమారు 20 మంది వచ్చి ప్రవీణ్ తల్లి లక్ష్మమ్మ, తండ్రి చంద్రశేఖర్, సోదరి పల్లవిపై దాడి చేసి కళ్యాణిని బలవంతంగా తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ప్రవీణ్ కారు తీసుకుని వారిని వెంబడించగా, కర్రలు, రాళ్లతో తనపై దాడికి యత్నించారని.. కారు అద్దాలు ధ్వంసమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య కళ్యాణి ప్రాణాలకు ముప్పు ఉందని, తమ కుటుంబీకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంచాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
